ఒకరికి కాదు.. ఇద్దరికి కాదు... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అనేక మంది ఎమ్మెల్యేలకు ఇప్పుడు అది ఒక పని అవుతోంది. తాము పార్టీని వీడటం లేదు.. అని చెప్పుకోవడమే వీళ్లకు ఇప్పుడు పెద్ద పని అవుతోంది. అనేక మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల విషయంలో పుకార్లు పుడుతున్నాయి. వాళ్లు తెలుగుదేశం దిశగా వెళ్తున్నారనే ప్రచారం జరుగుతోంది. జలీల్ ఖాన్ , ఉప్పులేటి కల్పన, ఆదినారాయణరెడ్డి. అత్తార్ చాంద్ భాష... వంటి వాళ్లంతా జంప్ చేస్తారనే వార్తలు వస్తున్నాయి. తెలుగుదేశం అనుకూల మీడియా ఈ వార్తలను హోరెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీలోనే వీళ్ల పట్ల అనుమానపు చూపులు తప్పడం లేదు. ఇటువంటి నేపథ్యంలో ఈ ఎమ్మెల్యేలు ఎవరికి వారు తమ సచ్ఛీలతను నిరూపించుకోవాల్సి వస్తోంది. ఒకరి తర్వాత ఒకరుగా మీడియా ముందుకు వచ్చి.. తాము వైకాపాను వీడటం లేదు అని ప్రకటించుకోవాల్సి వస్తోంది. తాజాగా అనంతపురం జిల్లా కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్ భాష మీడియా ముందుకు వచ్చాడు. తను వైకాపాను వీడటం లేదని ఈయన స్పష్టం చేశాడు. తెలుగుదేశం వాళ్లు అవతలి పార్టీ వాళ్లను ఆకర్షించడం మాట ఎలా ఉన్నా... తమ పార్టీ ఎమ్మెల్యేలు చేజారకుండా చూసుకోవాలని భాష సూచించాడు, తను వైఎస్సార్ కాంగ్రెస్ లోనే ఉంటానని భాషా స్పష్టం చేశాడు. మొత్తానికి మీడియా పుణ్యమా అంటూ చాలా మంది పై ఇలాంటి పుకార్లు వస్తున్నాయి. వారిలో ఖండించుకొనే వాళ్లు మీడియాను పిలిపించుకొని ఖండన ప్రకటన విడుదల చేస్తున్నారు. ప్రస్తుతానికి వైకాపా ఎమ్మెల్యేలకు ఇదే పెద్ద పని!

మరింత సమాచారం తెలుసుకోండి: