మొన్న న్యూయార్క్, నిన్న సిడ్నీ...ప్రధాని నరేంద్ర మోదీ నినాదాలతో మారుమోగిపోయాయి. ఇక మోదీ నామస్మరణలో తడిసిముద్దకానున్న తర్వాతి నగరమేదీ అన్న సందిగ్ధానికి బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి రామ్ మాధవ్ తెర దించారు. త్వరలోనే బ్రిటన్ రాజధాని లండన్ లో మోదీ పర్యటన జరగబోతోందని, అక్కడ న్యూయార్క్, సిడ్నీల కంటే అధిక సంఖ్యలో ప్రవాస భారతీయులు మోడీ నామస్మరణ చేయనున్నారని ఆయన సోమవారం రాత్రి ఓ ఆంగ్ల టీవీ ఛానెల్ కిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో ప్రవాస భారతీయులు ఉన్న నగరం లండనేనని చెప్పిన రామ్ మాధవ్, మోదీ త్వరలో అక్కడ నిర్వహించనున్న బహిరంగ సభకు జనం పోటెత్తనున్నారని చెప్పారు. ఈ తరహా కార్యక్రమాలపై పార్టీ తరపున ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్న ఆయన, వీటి రూపకల్పన మొత్తం మోదీ అప్పటికప్పుడు చేసుకుంటున్నదేనని తెలిపారు. ఆయా దేశాల్లో తన పర్యటన ఖరారు కాగానే, మోదీ ఇలాంటి కార్యక్రమాలను రూపొందించుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. లండన్ లో జరిగే కార్యక్రమం న్యూయార్క్, సిడ్నీ సభలను తలదన్నే రీతిలో ఉండబోతోందని మాధవ్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: