ఏపీ సీఎం చంద్రబాబునాయుడు జపాన్ పర్యటనలో భాగంగా అక్కడి పారిశ్రామిక సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలపై ఒక్కరోజు తిరక్కుండానే రాష్ట్రంలో నిరసనలు మొదలయ్యాయి. సోంపేటలో 4 వేల మెగా వాట్ల థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్ర నిర్మాణానికి సంబంధించి చంద్రబాబు జపాన్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ నేపథ్యంలో సోంపేటలో పర్యావరణ ఉద్యమకారులు సోంపేట మండలం బారువా వద్ద ఆందోళనకు దిగారు. గతంలో ఇక్కడ ఏర్పాటు చేయతలపెట్టిన 2,640 మెగావాట్ల ధర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రానికి సంబంధించి నాగార్జున కన్ స్ట్రక్షన్స్ తో కుదిరిన ఒప్పందం స్థానికుల ఆందోళనలతో రద్దైన సంగతి తెలిసిందే.  అయితే తాజాగా 4 వేల మెగావాట్ల థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రం నిర్మాణానికి జపాన్ సంస్థలో సర్కారు ఒప్పందంపై స్థానికులు భగ్గుమంటున్నారు. స్థానికుల ఆందోళనకు మద్దతు పలికిన వైకాపా చంద్రబాబును ఇరకాటంలోకి నెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. జపాన్ సంస్థతో కుదిరిన ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేసుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగక తప్పదని వైకాపా కార్యదర్శి సాయిరాజు ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: