తెలంగాణ ప్రభుత్వం బ్రాండ్ అంబాసిడర్ గా సానియా మీర్జా నియమితమైందన్న విషయం తెలిసిందే. పేరుకైతే సానియా బ్రాండ్ అంబాసిడర్ కానీ.. ఆమె ఈ విషయంలో చలాకీగా కనిపించడం లేదు. తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రచారం చేసి పెట్టడం లేదు. ఏదో రెండు సార్లు కేసీఆర్ ను కలిసింది.. ఒక్కోసారికోటి రూపాయల బహుమతిని పొందింది. అంతే!

ఆ తర్వాత మాత్రం ఆమె తెలంగాణ రాష్ట్రం అనే మాటనుఎత్తలేదు. మరి ఈ మాత్రం దానికా ఆమెను బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించి కోట్ల రూపాయల బహుమతులను ఇవ్వడం! అని అనేక మంది ఆశ్చర్యపోతున్నారిప్పుడు. ఆమె సంగతి అలా ఉంటే.. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి కొత్త బ్రాండ్ అంబాసిడర్ తయారయ్యాడు.

ఈయనే గద్దర్. ఈ ప్రజా నాయకుడికి ఇన్ని రోజులూ కేసీఆర్ తో అంతగా పడలేదు. దీంతో చాలా దూరం పాటించాడు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎక్కడ తేడాలు వచ్చాయో కానీ.. గద్దర్ మాత్రం తన మానాన తనుండిపోయాడు. అయితే ఇప్పుడు ఎక్కడో రాజీ కుదిరినట్టుగా ఉంది. అందుకే ఈయన మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని ప్రశంసిస్తున్నాడు.

కేవలం ప్రశంసించడమేగాక.. ప్రజల మధ్య కు వెళ్లి ఆ కార్యక్రమ ఆవశ్యకత గురించి వివరిస్తున్నాడు. ఇదంతా చూస్తుంటే గద్దర్ తెలంగాణ ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్ అయినట్టుగానే భావించాల్సి ఉంటుంది. మరి అసలు బ్రాండ్ అంబాసిడర్ అడ్రస్ లేకుండా పోయింది కానీ.. కేసీఆర్ ప్రభుత్వానికి ఈ కొత్త అంబాసిడర్ కలిసి వచ్చినట్టున్నాడు!

మరింత సమాచారం తెలుసుకోండి: