రాజధాని వ్యవహారంపై ఉద్యమానికి వైసీసీ ప్రయత్నిస్తోంది. మార్చి మూడు నుంచి వైసీసీ అధినేత వైఎస్ జగన్ తుళ్లూరు ప్రాంతంలో పర్యటించనున్నారు. తమతో కలిసి వచ్చే ఇతర ప్రతిపక్ష పార్టీలతో కలిసి ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో వైసీసీ పోరాటాలు ఎంత వరకూ ముందుకెళతాయనేది ఆసక్తిగా మారింది. నవ్యాంధ్ర రాజధానిపై ఏపీ పొలిటికల్ వర్గాలలో తీవ్ర చర్చ నడుస్తోంది. డిసెంబర్ 31 నుంచి అమలులోకి వచ్చిన రాజధాని భూ సేకరణ గడువు ఫిబ్రవరి 28తో ముగిసింది. ఇప్పటికే పలుమార్లు భూ సేకరణ గడువును పెంచిన రాష్ర్ట ప్రభుత్వం... ఈసారి భూ సేకరణ గడువు పెంచేది లేదని స్పష్టం చేసింది. ఈలోగా భూములు ఇవ్వని రైతుల నుంచి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పడంతో.. వైపిపి పోరుకు సిద్ధమైంది.
తుళ్లూరులో పర్యటించిన వైసీపీ నేతలు.. రాజధాని నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదనీ అయితే కేపిటల్ పేరుతో జరుగుతున్న భూ సేకరణ ఎవరికి మేలు చేస్తుందని వైసీసీ నేతలు ప్రశ్నిస్తున్నారు. సింగపూర్ సంస్థలు, ఎన్జీఓలు ప్రజలకు సేవ పేరుతో లాభాలు అర్జించేందుకు సిద్ధమయ్యయని జగన్ పార్టీ లీడర్లు మండిపడుతున్నారు. ఇప్పటికే తుళ్లూరులో వైసీపీ నేతలు పర్యటించారు. ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సైతం రంగంలోకి దిగేందుకు రెడీ అవుతున్నారు. రాజధాని ప్రాంతంలో పర్యటనకు సిద్ధమయ్యారు.
ప్రభుత్వం చేస్తున్న రియలెస్టేట్ వ్యాపారాన్ని ప్రజల దృష్టికి తీసుకువచ్చేందుకే తాము పోరాడుతున్నామని వైసీపీ నేతలంటున్నారు. ఇందుకు ఇతర పార్టీలను కూడా కలుపుకుని పోతామని చెబుతున్నారు. చంద్రబాబు విధానాలను ఎండగట్టేందుకు మేథా పాట్కర్, అన్నాహజారే లాంటి నేతలను కూడా తుళ్లూరుకు తీసుకువస్తామంటున్నారు.
యుద్ధ వాతావరణం.. భూ సేకరణ గడువు ఫిబ్రవరి 28తో ముగిసిపోయింది. దీంతో వైసీసీ చేసే పోరాటం ఎంత వరకూ సఫలం అవుతుందో చూడాలీ. ఇప్పటికే 28 వేల ఎకరాలు సేకరించిన ప్రభుత్వం.. మిగతా అంతా చట్టప్రకారం చేస్తామనడంతో తుళ్లూరు ప్రాంతంలో యుద్ధవాతావరణం నెలకొంది. రైతులు ప్రభుత్వ బలవంతం లేకుండానే.. భూములు ఇస్తుంటే.. ఎందుకు అదనపు బలగాలను దింపారని ప్రశ్నిస్తున్నారు. దీంతో జగన్ పర్యటన ఎలా సాగుతుందనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.