సాప్ట్ వేర్ అభివృద్ధితో మనకు సమకూరుతున్న సౌకర్యాలెన్నో.. ఇంట్లోనే ఉండి ఎంచక్కా.. ఎన్నో పనులు చేసుకుంటున్నాం. షాపింగ్, బ్యాంకింగ్, బుకింగ్.. ఇలా ఏదైనా ఇప్పుడు కీబోర్డు మునివేళ్ల కదలికతో సాధ్యమైపోతున్నాయి. గతంలో రోజుల తరబడి తిరిగినా కాని పనులు ఇప్పుడు ఇల్లు కదలకుండానే చిటికెలో అయిపోతున్నాయి.
టెక్నాలజీ రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. మంచికి వాడుకుంటే మంచి.. చెడుకు వాడు కుంటే చెడు జరిగిపోతాయి. ఇప్పుడు ఈ సాప్ఠ్ వేర్ అభివృద్ధి కూడా అలాగే ఉంది. దీన్ని కొందరు క్రిమినల్స్ తమ నేరాల కోసం వాడుకుంటున్నారు. అదే టెక్నాలజీని అడ్డుపెట్టుకుని కోట్లు కొల్లగొడుతున్నారు.
ముఖ్యంగా సైబర్ నేరాల విషయంలో ఇది మరింత జోరుగా ఉంది. ఫ్రీగా వస్తే మనిషి దేన్నీ వదలడు.. డిస్కౌంట్ అన్నాచాలు.. క్యూ కట్టేస్తారు. ఇదే సూత్రాన్ని మోసగాళ్లు ఉపయోగించుకుంటున్నారు. తక్కువ ధరకే బంగారం అమ్ముతాం.. మీకు ఫలానా లాటరీలో ప్రైజొచ్చింది.. మీ అకౌంట్ నెంబర్ డిటైల్స్ చెప్పండి.. మీ అకౌంట్లో డబ్బు వేసేస్తాం.. వంటి ఫోన్ కాల్స్ ద్వారా సైబర్ నేరాలకు ఉపయోగించుకుంటున్నారు.
ఇలాంటి ఫేక్ ఫోన్ కాల్స్ ముఖ్యంగా.. పాకిస్తాన్ నుంచి వస్తున్నాయట. ఈ సైబర్ నేరాలపై దృష్టిపెట్టిన సీఐడీ పోలీసులు.. ఈ నిర్ధారణకు వచ్చారు. ముఖ్యంగా +92తో ప్రారంభమయ్యే నంబర్లమీద కాల్ వస్తే ఫోన్ తీయవద్దని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి అంకెలతో ప్రారంభమయ్యే నంబర్లతో ఎక్కువగా పాకిస్థాన్ నుంచి ఫోన్లు వస్తాయట. బ్యాంకులేవీ ఖాతాదారు డెబిట్, క్రెడిట్ కార్డుల పిన్నంబర్లు కోరవని.. ఫోన్ చేసి అలా అడిగితే అవి కచ్చితంగా మోసగాళ్లవేనని గుర్తించాలని కోరుతున్నారు. ఓకే గుర్తుంది కదా.. +92 కోడ్ నెంబర్ తో కాల్స్ వస్తే మాత్రం చచ్చినా తీయకండి.. ఒకవేళ తీసినా.. అలర్ట్ గా ఉండండి.. ఓకే.