రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ టీడీపీ నేతలకు గట్టి ఝలక్ ఇచ్చారు. ఇన్నాళ్లూ బాబు, మోడీలకు పక్క వాయిద్యంగా కనిపించిన పవన్.. ఇప్పుడు రెబల్ స్టార్ అవతారం ఎత్తడంతో పసుపుదళం అయోమయంలో పడింది. రాజధాని ప్రాంతానికి వెళ్లే ముందు ఇంటికొచ్చి మరీ చెప్పి వెళ్లిన పవన్.. ఉన్నట్టుండి ఇలా స్టాండ్ మార్చేసరికి సర్కారు పెద్దలు తలపట్టుకుంటున్నారు.

పవన్ కల్యాణ్ రాజధాని ప్రాంతం టూర్.. సాక్షి మీడియాకు మాత్రం పసందుగా మారింది. పవన్ కల్యాణ్ రాజధాని పల్లెల్లో జగన్ గ్యాంగుపై విమర్శలు గుప్పిస్తారనుకుంటే.. అచ్చం జగన్ తరహాలోనే మాట్లాడటంతో సాక్షి మీడియా మొదట ఆశ్చర్యపోయింది. పవన్ స్టాండే అర్థం కాగానే.. ఇక రెచ్చిపోయింది.

పవన్ దూకుడుతో టీడీపీ నేతలకు షాక్ తగిలిందంటూ సాక్షి టీవీలో ప్రసారాలు జోరందుకున్నాయి. రాజధాని ప్రాంతంలో అక్రమంగా భూములు లాక్కుంటుందన్న వాదానికి పవన్ పర్యటనే ఓ ఉదాహరణ అని రన్నింగ్ కామెంటరీ ఇచ్చేసింది. వైసీపీ మొదటి నుంచీ ఇదే చెబుతోందని.. కానీ పచ్చ మీడియా రైతులు స్వచ్ఛంధంగా భూములిస్తున్నారని ప్రచారం చేసిందని తెలిపింది.

పవన్ టూర్ కారణంగా వైఎస్ జగన్ చెప్పింది నిజమేనని తేలిపోయిందని కంక్లూజన్ ఇచ్చేసింది. పవన్ కల్యాణ్ టూర్ ను సాధ్యమైనంత మేర లైవ్ ప్రసారం చేసి దూకుడు ప్రదర్శించింది. పవన్ ఏం చెప్పాడు.. చంద్రబాబు ఏం చెప్పాడన్నది గ్రాఫిక్స్ తో ప్రజెంట్ చేస్తూ కొత్త పుంతలు తొక్కింది సాక్షి మీడియా. ఐతే ఇదే మీడియా... నిన్న మొన్నటి వరకూ పవన్ పసుపుదళం చేతిలో పావుగా మారాడని విమర్శించిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: