కోట్లాది భారత క్రికెట్ అభిమానుల ఆశలు ఆవిరయ్యాయి. మరోసారి కప్ గెలుస్తారన్న భారతీయుల కల చెదిరింది. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలో దిగినా.. అనూహ్యంగా అన్ని మ్యాచులూ నెగ్గుతూ టీమ్ ఇండియా అందరిలో ఆశలు రేపింది. అత్యుత్తుమ ప్రతిభ చూపుతూ.. సత్తా చాటింది. కప్ మనదే అన్న ధీమా కలిగించింది. 

తీరా.. అసలు సిసలైన సమరం సమయానికి చేతులెత్తేసింది. కీలక సమయంలో సమిష్టిగా విఫలమై పరాజయంతో ప్రస్తానం ముగించింది. ఐతే.. ఈ పరాజయంతో ఏమాత్రం సంబంధం లేకపోయినా ఓ బాలీవుడ్ హీరోయిన్ ఇప్పుడు క్రికెట్ అభిమానులతో నానా మాటలు అనిపించుకుంటోంది. బండబూతులు తిట్టించుకుంటోంది. ఆమే అనుష్క శర్మ. ఆమె భారత్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ గర్ల్ ఫ్రెండ్ అన్న సంగతి తెలిసిందే. అందరిలాగానే ఆమె కూడా భారత్ మ్యాచ్ చూసేందుకు సిడ్నీ వెళ్లింది.

కీలక సమయంలో విరాట్ కోహ్లీ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔట్ అవ్వడంతో.. భారత అభిమానులు ఆగ్రహించారు.  అనుష్క సిడ్నీ రావడంతోనే కోహ్లీ ఏకాగ్రత చెదిరిందని కామెంట్ చేశారు. ఇక భారత్ ఓటమి దిశగా పయనిస్తున్నందసేపూ ట్విట్టర్లో అనుష్క శర్మపై భారత అభిమానుల తిట్ల పరంపర కొనసాగింది. విరాట్ ఫెయిల్యూర్ కు అనుష్కే కారణమంటూ కామెంట్లు వెల్లువెత్తాయి. 

అనుష్క సిడ్నీ వెళ్లి తప్పుచేసింది.. ఆమెను దేశం క్షమించదు.. అంటూ కొందరు ట్వీట్లు పెట్టారు. అనుష్కది అసలైన ప్రేమ.. అందుకే ప్రియుడు చేసే ఒక్క పరుగు కోసం సిడ్నీ వెళ్లిందని వెటకారం చేసారు. ట్విట్టర్లో ఈ దాడిని మరికొందరు తిప్పికొట్టారు. ఇందులో అనుష్క తప్పేముందని.. అలాంటి కామెంట్లు పెట్టడం బుద్దితక్కువ పని అని అనుష్కకు మద్దతు పలికారు. మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా అనుష్కకు మద్దతుగా నిలిచారు.


మరింత సమాచారం తెలుసుకోండి: