తుళ్లూరు.. భవిష్యత్ ఆంధ్రా రాజధాని నగరం కానున్న ఈ పట్టణం.. ఇప్పుడు క్రమంగా ప్రాధాన్యం సంతరించుకుంటోంది. ఇకపై రాష్ట్రానికి సంబంధించిన ఏ కార్యక్రమమైనా తుళ్లూరు నుంచే ప్రారంభిస్తానని చంద్రబాబు ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. ఆల్రెడీ ఒకటి రెండు పండుగలు ఇక్కడ జరిపారు కూడా. ఇప్పుడు ఏకంగా పొలిటికల్ సీన్ కూడా తుళ్లూరుకు మారుతోంది.
పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని
రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో.. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని మొట్ట మొదటి సారిగా.. రెండు రాష్ట్రాల్లో వేర్వేరుగా జరుపుకునేందుకు ఆ పార్టీ ప్లాన్ చేస్తోంది. మార్చి 29న పార్టీ 34వ వ్యవస్థాపక దినోత్సవాన్ని తెలంగాణ తెలుగుదేశం కమిటీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లోనూ, ఆంధ్రప్రదేశ్ కమిటీ ఆధ్వర్యంలో కొత్త రాజధాని తుళ్లూరులో జరుపుకునేందుకు ఆ పార్టీ నేతలు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో
ఆదివారం ఉదయం 8 గంటలకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జరిగే వ్యవస్థాపక దినోత్సవంలో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ఎన్టీఆర్ ఘాట్కు వెళ్లి నివాళులర్పిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని గుంటూరు జిల్లా తుళ్లూరులో జరిగే పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొంటారు.
తుళ్లూరు లేదా విజయవాడలో
ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు.. తుళ్లూరులో పూర్తయ్యాయి. 2019 నాటికి నూరు శాతం అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు గెలవడమే లక్ష్యంగా కృషిచేస్తామని ఈ సందర్భంగా మంత్రి పుల్లారావు చెబుతున్నారు. ఇక టీడీపీ తరహాలోనే మిగిలిన పార్టీలు కూడా రెండు చోట్లా వేడుకలకు ప్లాన్ చేసుకునే అవకాశం కనిపిస్తోంది. తుళ్లూరు లేదా విజయవాడలో ఆంధ్రా విభాగం వేడుకలు జరిపే ఛాన్స్ ఉంది.