గులాబీ దళపతి ఇప్పుడు తన వ్యూహాలకు మరిన్ని మెరుగులు అద్దుకునే పనిలో పడ్డారు. ఇక ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ తన టార్గెట్ గ్రేటర్. గ్రేటర్ లో గ్రేట్ అనిపించుకోవలన్న తపనతో కొత్త ప్రయోగాలకు తెర తీస్తున్నాడు. విశ్వప్రయత్నాలు చేస్తున్నారాయాన. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో హైదరాబాద్ లో షాక్ ఇవ్వడంతో కొత్త వ్యూహాలు సిద్ధమయ్యాడు.
ఇప్పటికే తెలంగాణ జిల్లాల్లో టీఆర్ఎస్ బలమైన పార్టీగా మారింది. గ్రామస్థాయి పునాదులు పటిష్టంగా ఉన్నాయి. కానీ హైదరాబాద్ లో మాత్రం పార్టీ బలహీనంగ ఉందనే చెప్పాలి. రాజధాని లో తన పార్టీ బలం పెంచడానికి గులాబీ బాస్ పావులు కదుపుతున్నాడు. రానున్న గ్రేటర్ లో గులాబీ జెండాను ఎగరేయాలని భావిస్తున్నాడు. ఆపరేషన్ ఆకర్ష్ తో ప్రత్యర్థి పార్టీ నాయకులకు గాలం వేస్తున్నాడు. గ్రేటర్ ఎన్నికలే టార్గెట్ తో గ్రేటర్ సీమాంధ్రులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. గ్రేటర్ ఎన్నిక లో సీమాంధ్రులు పెద్ద సంఖ్యలో స్థిరపడిన నేపథ్యంలో వారి ఓట్లు కీలకం కావడంతో వారి పై కన్నేసాడు కేసీఆర్. గతంలో ఎన్నడులేని విధంగా వారి పై ఎనలేని ప్రేమ కురిపిస్తున్నారు.
హైదరాబాద్లో నివసించే ప్రతి వారు హైద్రాబాదీలే. సెటిలర్స్ ఎవరూ లేరు. ఏ సమస్య వచ్చినా మీ పెద్ద కొడుకు గా ఉంటానని ఎవ్వరికి భయపడవలసిన ఆవసరం లేదని ఇటీవలే కేసీఆర్ ‘సెటిలర్స్’కి బోల్డంత భరోసా ఇచ్చేశారు. మీ కాలుకు ముళ్లు గుచ్చితే తన నోటితో తీస్తానని పెద్ద మాటలే పలికుతూ, వారిని మెప్పించే పనిలో పడ్డారు.
ఇందుకనుగునంగా గ్రేటర్ లో మంచి పట్టు ఉన్న తెలుగుదేశం నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఆహ్వానించి మంత్రి పదవి కట్టబెట్టారు. పార్టీలో ఇతర నాయకులకు మింగుడు పడడంలేదనది వాస్తవమైనా, హైదరాబాద్ లో పార్టీ బలం పెంచడానికి తలసాని వంటి నాయకుని ఆవసరమని భావిస్తోంది ఆధికార పార్టీ. సీమాంధ్రుల ఆభిమానాని చురగొన్న తలసాని శ్రీనివాస్, దాన్ని వాడుకోవాలని చూస్తోంది గులాబీ పార్టీ. తలసాని సినిమాటోగ్రఫీ మంత్రి కావడంతో హైదరాబాద్ లో ఆంధ్రకు చెందిన సినీ పెద్దలను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. టాలీవుడ్ పరిశ్రమకు తమ ప్రభుత్వం సహకారం ఎప్పటికీ ఉంటుందని చెప్పారు. మంత్రిగా ఉన్నంత వరకు ఎవరికీ ఇబ్బందులు ఉండవన్నారు. సినిమాకు కులం, మతం, ప్రాంతం అనే బేధం లేదని చెప్పారు. సినీ పరిశ్రమ ఎక్కడికీ వెళ్లబోదన్నారు. హైదరాబాద్ లో స్వేచ్చగా షూటింగులు చేసుకోవచ్చని భరోసా ఇచ్చేశారు తలసాని.
గతంలో రామోజీ ఫిలిం సిటీని లక్ష నాగళ్లతో దున్నిస్తానన్న కేసీఆర్, తనంతట తానే స్వయంగా వెళ్లి రామోజీరావును ఎందుకు కలుసుకున్నట్లు అన్న ప్రశ్నే ఇప్పుడు చర్చనీయాంశం. స్నేహపూర్వకంగా కలుసుకోవడానికో, సరదాగా మాట్లాడుకోవడానికో ఫిలిం సిటీకి వెళ్లేంత తీరిక తెలంగాణ సీఎంకు ఉందంటే ఎవ్వరూ నమ్మరు. తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసిన తరువాత కరీంనగర్లో జరిగిన తొలి బహిరంగ సభలో, లక్షలాది మంది సమక్షంలో సభా వేదిక నుంచి.. ఫిలింసిటీ పేరిట రామోజీరావు తెలంగాణ ప్రజల భూములను ఆక్రమించుకున్నాడని, తెలంగాణ రాష్ట్రం వచ్చాక లక్ష నాగళ్లతో ఫిలింసిటీ దున్నిస్తానని కేసీఆర్ ప్రకటించారు. ఆ బహిరంగ సభా ప్రాంగణంలోనే ఆయన ప్రేరణతోనే రామోజీరావు సంపాదకత్వాన నడుస్తున్న దినపత్రిక ప్రతులను కార్యకర్తలు, అభిమానులు తగులబెట్టారు కూడా. అంతలోనే మాటమార్చడంలో మార్చడం, ఆందుకు కారణం, త్వరలో రానున్న గ్రేటర్ ఎన్నికలే కారణమని వినిపిస్తోంది.
మంచి మాటలతో హైదరాబాద్ లో స్ధిరపడ్డ సీమాంధ్రులను మచ్చిక చేసుకోవడం ద్వారా గ్రేటర్ ఎన్నికల్లో గెలుపొందాలని టీఆర్ఎస్ భావిస్తున్నట్టే కనిపిస్తోంది. అయితే ఎన్నికలు అయిపోయాక కేసీఆర్ స్వరంలో మళ్లీ మార్పు రావచ్చన్న వాదన లేకపోలేదు. యూపీఏ సర్కార్ తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తానని కేసీఆర్ పలు మార్లు చెప్పారు. మరోవైపు తెలంగాణ వస్తే తొలి సీఎంగా దళితుడినే చేస్తానని అనేక సార్లు హామీ ఇచ్చినా ఆచరణకు మాత్రం రాలేదు. ఈ నేపథ్యంలో సహజంగా మాటల మీద నిలబడని కేసీఆర్.. గ్రేటర్ సీమాంధ్రులు ఎలా నమ్మిస్తాడన్నదే ఇప్పుడు హాట్ టాపిక్.