ముంబయి : వివాదాలకు చిరునామాగా మారిన ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపిఎల్)లో మరో కొత్త వివాదానికి వేదిక కాబోతోంది. ఐపిఎల్-8 ఎడిషన్ ప్రారంభానికి మరో తొమ్మిది రోజులు మాత్రమే వుండగా డిఫెండింగ్ చాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్(కెకెఆర్) ఐపిఎల్-8కి దూరంగా వుండాలని భావిస్తున్నట్లు సమాచారం. దీనికి కారణం వెస్టిండీస్ మ్యాజిక్ స్పిన్నర్ సునీల్ నరైన్. నిరుడు సెప్టెంబరులో జరిగిన ఐపిఎల్ చాంపియన్ లీగ్(సిఎల్టి)లో అనుమానస్పద బౌలింగ్తో నిషేధానికి గురైన నరైన్ను తాజా ఐపిఎల్ ఎడిషన్లో ఆడేంచేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బిసిసిఐ) నిరాకరించడమే కొత్త వివాదానికి కారణం.
కోల్కతా నైట్ రైడర్స్
నిరుడు జరిగిన సిఎల్టిలో నరైన్పై బిసిసిఐ నిషేధం విధించడంతో చెన్నైసూపర్ కింగ్తో జరిగిన ఫైనల్తో పాటు అంతర్జాతీయ క్రికెట్కు పూర్తిగా దూరంగా వున్న నరైన బౌలింగ్ను సరిచేసుకొని ఐసిసి నుంచి క్లియరెన్స్ పొందాడు. అయితే మాత్రం ఐసిసి నుంచి క్లియరెన్స్ పొందినా.. బిసిసిఐ నిర్వహించే బయోమెకానికల్ బౌలింగ్ పరీక్షకు నరైన్ హాజరుకావల్సిందేనని పట్టుపడుతుండగా, ఐసిసియే నరైన్ బౌలింగ్ బాగుందని సర్టిఫికెట్ ఇచ్చినప్పుడు మళ్ళీ రెండోసారి బౌలింగ్ పరీక్ష ఎందుకని కెకెఆర్ వాదిస్తుంది. తాజా ఎడిషన్లో నరైన్ను ఆడించకపోతే ఐపిఎల్ నుండి తప్పుకుంటామని కెకెఆర్ బిసిసిఐకి తేల్చిచెప్పినట్లు సమాచారం.