‘‘అనగనగా ఆ అడవుల్లో ఒక పెద్ద టైగర్ జోన్... మనుషుల్ని తినడానికి అలవాటు పడిన మేనీటర్ పులులు సంచరిస్తూ ఉంటాయి గనుక.. అటువైపు ఎవ్వరూ వెళ్లవద్దంటూ హెచ్చరిక బోర్డులు.. ఆ బోర్డుల్ని లెక్క చేయకుండా వెళ్లిన వారంతా.. దుర్మరణం చెందడం.. శవాలు దొరికేసరికి పులిచంపినట్లుగా గుర్తులు కనబడడం.. ఇలా ఆ అడవివైపు మనుష్య సంచారం రాకుండా చేసేసి.. ఆ అడవి మధ్యలోంచి అక్రమ వ్యాపారాల్ని కొనసాగిస్తూ ఉండడం..’’ ఇదంతా వింటోంటే.. కొండవీటిదొంగ కథ చెప్పినట్లుగా ఉంది కదా! ఇంచుమించుగా ఇదేలాగా కొన్ని మార్పులు... చేర్పులతో .. మెగాస్టార్ నటించిన కొండవీటి దొంగ కథ మహబూబ్నగర్ జిల్లాలోని నల్లమల అడవుల్లో జరగబోతున్నదిట. తెలుగుదేశం నాయకులు.. కేసీఆర్ ను విలన్గా చిత్రీకరిస్తూ ఇలాంటి ఆరోపణలు గుప్పిస్తున్నారు.
విషయం ఏంటంటే.. నల్లమల అభయారణ్యంలో ఉన్న పులులకు ఆ అటవీ ప్రాంతంలోని గిరిజనులైన చెంచులు ఎక్కువగా ఉంటారు. అయితే చెంచుల వలన అటవీ ప్రాంతంలోని గిరిజనులను మైదాన ప్రాంతాలకు తరలించాలని కేసీఆర్ సర్కారు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈనేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎర్రబెల్లి దయాకర్రావు, రేవంత్రెడ్డి ఆరోపిస్తున్నారు. చెంచులను ఇక్కడినుంచి తరిమేసి... నల్లమాల అటవీ ప్రాంతాన్ని వజ్రాల అన్వేషణ పేరుతో బడా కంపెనీలకు కట్టబెట్టడానికి కేసీఆర్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదంటూ ఆరోపిస్తున్నారు. పాత ప్రభుత్వాల కాలంలో నల్లమల అటవీప్రాంతంనుంచి చెంచులను తరలిస్తున్నారనే సంగతి తెలుసుకుని.. కేసీఆర్ కుమార్తె కవిత చెంచుల వద్దకు వచ్చి.. వారికి అండగా ఉండి.. తరలింపునకు వ్యతిరేకంగా పోరాడుతాం అని చెప్పిన వైనాన్ని ఇప్పుడు ఎర్రబెల్లి గుర్తు చేస్తున్నారు.
తీరా అదే కేసీఆర్.. ఇప్పుడు తాను అధికారంలోకి వచ్చిన తర్వాత.. చెంచుల వలన పులులకు ప్రమాదం అనే సాకులు చూపిస్తూ.. వారిని తరలించాలని యత్నిస్తున్నారని.. అడవుల్లోని వజ్రాల గనులను బడా కంపెనీలకు దోచిపెట్టడానికి ఇదంతా కుట్ర అని వారు ఆరోపిస్తున్నారు.
చూడబోతే కొన్ని చిన్నచిన్న మార్పులతో ‘కొండవీటిదొంగ ’ ఎపిసోడ్నే ప్రస్తుతం నల్లమల అడవుల్లో నడిపిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ వ్యవహారం ముందుముందు ఎలాంటి ట్విస్టులు తిరుగుతుందో వేచిచూడాలి.