చంద్రబాబునాయుడు ఎంత నిరంకుశంగా వ్యవహరించగలరనడానికి మొన్నటికి మొన్న అంగన్వాడీ టీచర్లను ఉద్యోగాలనుంచి తొలగించడం పెద్ద ఉదాహరణ. అయితే ఇప్పుడు అదే ఎజెండాతో ప్రతిపాదనలు సిద్ధం చేసుకుని ఓ మంత్రిణి చంద్రబాబు గ్రీన్సిగ్నల్ కోసం ఎదురుచూస్తోంది. చంద్రబాబుకు నెల్లూరులో మంటెత్తించిన ‘అంగన్వాడీ వేతనాల పెంపు’ అనే మాటెత్తితే.. ఆయన మళ్లీ ఆగ్రహోదగ్రుడైపోయి.. ఈ ఆడమంత్రిని కూడా డిస్మిస్ చేసేస్తారా అని పార్టీ వాళ్లు జోకులేసుకుంటున్నారు.
చంద్రబాబునాయుడు తాను మారిన మనిషిని అని ఓట్లు అవసరమైన సందర్భాల్లో ప్రజల ముందు చెబుతూ వచ్చారు. అంటే పాతకాలంలో చంద్రబాబు అంటే.. ప్రజలకు నచ్చని వ్యక్తి అని ఆయనకు కూడా క్లారిటీ ఉన్నట్లే. ఆయన దృష్టిలో ఆయన ఏం మారారో ఏం మారలేదో గానీ.. కనీసం తన సభలో ఏమైనా నిరసనలు కనిపించినా సహించలేని స్థితిలో అపరిపక్వంగానే ఉండిపోయారని మాత్రం మొన్న ఆయన బర్త్డే నాడే నిరూపణ అయింది. నెల్లూరులో జీతాలు పెంచాలంటూ ప్లకార్డులు చూపించిన 14 మంది అంగన్వాడీ టీచర్లను ఆరోజున ఆయన డిస్మిస్ చేశారు. తీరా ఇంత జరిగిన తర్వాత.. ఇప్పుడు అంగన్వాడీల జీతాలు పెంచడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశాం అంటూ శిశుసంక్షేమ మంత్రి పీతల సుజాత చెబుతున్నారు.
చంద్రబాబు అనుమతి కోసం ఎదురుచూస్తున్నదిట
జీతాలు పెంచడానికి ఫైలు సిద్ధం చేసి ఆమె ఇప్పుడు చంద్రబాబు అనుమతి కోసం ఎదురుచూస్తున్నదిట. పెంచడానికి సర్కారు నిర్ణయించుకున్నప్పుడు మధ్యలో పాపం.. అభాగ్యులైన ఉద్యోగుల్ని ఎందుకు బలిచేసినట్లో అర్థం కాదు. లేదా... ఇప్పటికైనా.. మళ్లీ అంగన్వాడీ జీతాల పెంపు అనే మాటెత్తితే.. నెల్లూరులో కనిపించిన నిరసనలు గుర్తుకొచ్చి చంద్రబాబునాయుడు సుజాతను కూడా ఇంటికి పంపేయవచ్చు. ఒకసారి మోనార్క్ అయిన తర్వాత.. ప్రతిసారీ అదే లక్షణాలు కనిపించడంలో వింతేముంటుంది!!