మహిళలు తల్చుకుంటే ఎంతటి ఘనకార్యమైనా సాధిస్తారు. మనోభలం ఉండాలే కానీ ఏ పనీ దేనికీ అడ్డు కాదని తెలియజెప్పింది ఓ మహిళ. కరీంనగర్కు చెందిన ప్రముఖ రన్నర్ కామారపు లక్ష్మీ తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్కు ఎక్కింది. ప్రస్తుతం తొమ్మది నెలలు నిండిన గర్భిణి అయిన లక్ష్మీ ఈ వారంలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. ‘గర్భంలోని శిశువును కాపాడండి... గ్రామంలో చెరువులు కాపాడండి’ అనే గొప్ప నినాదంతో ఆదివారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో 30 నిమిషాల 20 సెకన్ల వ్యవధిలో 5 కిలోమీటర్లు పరుగెత్తారు. అంతకుముందు లక్ష్మి పరుగును జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి సత్యవాణి, తెలంగాణ రాష్ట్ర ఒలింపిక్ సంఘం కార్యవర్గ సభ్యుడు గసిరెడ్డి జనార్దన్రెడ్డి ప్రారంభించారు. స్టేడియంలో 400 మీటర్ల ట్రాక్లో పన్నెండున్నర రౌండ్లు లక్ష్మి అలవోకగా పరుగెత్తి అందరినీ అబ్బురపర్చింది.
అంబేద్కర్ స్టేడియంలో పరుగు తీస్తున్న లక్ష్మి
ఈ పరుగుపందెం రికార్డును గిన్నిస్ బుక్లో చోటు కోసం పంపనున్నట్లు వెల్లడించారు. గతంలో మారథాన్ పరుగును కెనడా దేశానికి చెందిన అమీ 6 గంటల 12 నిమిషాల్లో పూర్తి చేశారని.. 9 నెలల గర్భిణి ఎవరూ ఇలాంటి సాహసం చేయలేదని వారు చెప్పారు. ఇలా చేయడం వల్ల తనకేమీ ఇబ్బంది కలగలేదని బిడ్డ ఆరోగ్యంగా ఉండడంతో పాటు సుఖ ప్రసవం జరుగుతుంది అని తెలియజేయడంతో పాటు.. మహిళల్లో స్ఫూర్తి నింపడానికే ఈ సాహసం చేశా.. రికార్డు సాధించడం ఆనందంగా ఉందని లక్ష్మి తెలిపారు.