భారీ భూకంపంతో చిగురాటుకులా వణికిపోయిన నేపాల్లో సంక్షోభం మరింత ముదిరింది. శనివారం 7.9 తీవ్రతతో సంభవించిన విషయం అందరికీ తెలుసు. ఈ భూకంపంలో రోడ్లు, భవనాలు, పురాతన కట్టడాలు అన్నీ భూస్తాపితం అయ్యాయి. ఎక్కడ చూసినా శిథిలాలు, శవాల గుట్టలు. ఈ భూకంప మృతుల సంఖ్య 4,000 దాటింది. వీరిలో అస్సాంకు చెందిన ఏడుగురు మహిళలు కూడా ఉన్నారు. ఈ భూకంపం వల్ల మరో 8000 మందికి పైగా ప్రజలు గాయపడ్డారు. ఈ విపత్తు వల్ల కూలిపోయిన వందలాది భవనాలు, ఇళ్ల శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించేందుకు సహాయ సిబ్బంది ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
శిథిలాల్లో చిక్కుకున్న వారిని రక్షిస్తున్న భద్రతా సిబ్బంది
సహాయ బృందాలు ప్రస్తుతం మారుమూల కొండ ప్రాంతాలకు చేరుకోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనేక దేశాల నుంచి వచ్చిన రక్షక నిపుణులు, సహాయ బృందాలు, వైద్యులు ముమ్మరంగా సహాయ చర్యలు కొనసాగిస్తున్నాయి. పలు దేశాలు భారీగా సహాయ సామగ్రిని పంపిస్తున్నాయి. వర్షంతో పాటు నిలిచిపోయిన విద్యుత్, రవాణా, సమాచార సౌకర్యాలు సహాయ చర్యలను ఆటంకపరుస్తున్నాయి.
సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న విదేశియులు
స్వదేశం కోసం వెళ్లేందుకు బారులు తీరిన బాధితులు, వివిధ దేశాల నుంచి పలు విమానాల్లో భారీగా వస్తున్న సహాయ సామగ్రితో కఠ్మాండులోని ఏకైక అంతర్జాతీయ విమానాశ్రయం కిక్కిరిసిపోయింది. భారత్ ఆపన్నహస్తం.. పొరుగుదేశం నేపాల్కు ఆపన్న హస్తం అందించడంలో భారత్ ముందుంది. జాతీయ విపత్తు స్పందన దళానికి(ఎన్డీఆర్ఎఫ్) చెందిన 10 బృందాలు, 13 సైనిక విమానాలు సహాయ చర్యల్లో ముమ్మరంగా పాల్గొంటున్నాయి.