తెలంగాణలో కాంగ్రెస్ సీనియర్ నేతగా సోనియా గాంధికి, కాంగ్రెస్ అధిష్టానానికి నమ్మిన బంటుగా ఉన్న ధర్మపురి శ్రీనివాస్ అలియాస్ డీఎస్ పార్టీకి గుడ్బై చెప్పారు. గురువారం ఉదయం పార్టీకి రాజీనామా చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన ఆవేదనంతా వెళ్లగక్కారు. నిజామాబాద్ నియోజక వర్గంలో కాంగ్రెస్ కు ఎంతో వైభవం తెచ్చానని, పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కాంగ్రెస్ అభివృద్దికి కృషి చేశానని ఆయన అన్నారు. కాంగ్రెస్ కు ఎంత చేసిన కొందరు స్వార్థపరులు తనకు ఎమ్మెల్సీ సీటు తక్కనివ్వకుండా చేశారని పదవుల కోసం పాకులాడే మనస్తత్వం తనది కాదని అయినా కూడా సీనియర్ నాయకుడు అన్న గౌరవం కూడా కాంగ్రెస్ పెద్దలు తన పట్ల చూపించలేదని వాపోయారు.
కాంగ్రెస్ పార్టీ
ఇక తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ ఇచ్చినప్పటికీ.. తెలంగాణ సాధనలో తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా నిరాహార దీక్ష చేపట్టి.. కేసీఆర్ అందరిని ఉత్తేజ పరిచిన మహా నాయకుడు అని పొగిడారు. కాంగ్రెస్ పార్టీ కోసం ఇంతకాలం నిబద్ధతతో పనిచేశానని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కేసీఆర్ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే పాటుపడుతున్నాడని అది తనకెంతో సంతోషం అనిపించిందని అన్నారు. పార్టీలకు అతీతంగా తెలంగాణ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాగా డీఎస్ బాటలోనే గ్రేటర్ హైద్రాబాద్ కాంగ్రెస్ నేత దానం నాగేందర్ కూడా టీఆర్ ఎస్ గూటికి చేరనున్నారని సమాచారం..?