శాసనసభలో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఫోటోను తొలగించేసిన వివాదం అంత తొందరగా సద్దుమణిగేలా లేదు. ఒకవైపు తమ నాయకుడి ఫోటో తొలగించేయడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఆందోళన చేయడానికి పూనుకుంటుండగా.. మరోవైపు వైఎస్సార్ ఆత్మ గా పేరున్నటువంటి.. ఆయనకు అత్యంత ఆప్తుడు, సన్నిహిత మిత్రుడు కేవీపీ రామచంద్రరావు.. కూడా ఈ విషయంలో స్పందించారు. శాసనసభ స్పీకరుకు ఆయన ఒక లేఖాస్త్రాన్ని సంధించారు.
నిజానికి శాసనసభ ఆవరణలో మాజీ ముఖ్యమంత్రుల ఫోటోలను ఏర్పాటుచేసే సాంప్రదాయం లేదు. అయితే.. వైఎస్ రాజశేఖరరెడ్డి పదవిలో ఉండగా మరణించడం, అది కూడా అత్యంత భయంకరమైన స్థితిలో.. అధికారిక కార్యక్రమం కోసం వెళుతూ.. హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తీరు.. అప్పటికి ఆయనకు ప్రజల్లో ఉన్న క్రేజ్.. ఇవన్నీ కలిసి.. ఆయనకు అలాంటి అరుదైన గౌరవం దక్కేలా చేశాయి. అప్పట్లోనే వైఎస్ ఫోటో పెట్టడాన్ని ప్రతిపక్షాలు సహజంగానే వ్యతిరేకించాయి. ప్రభుత్వం పట్టించుకోకుండా ఆయన నిలువెత్తు పోటో ఏర్పాటుచేసింది. తీరా కొన్ని రోజుల కిందట దాన్ని తొలగించేశారు.
ఫోటో తమకు చెప్పకుండా ఎలా తొలగిస్తారంటూ వైకాపా సభ్యులు ఒక అర్థంలేని వాదన వినిపించారు. ఆ తర్వాత.. ఫోటో పెట్టడం కోసం పోరాడుతాం అన్నారు కానీ.. అలాంటిదేమీ జరగలేదు. అయితే ''వైఎస్ ఆత్మ'' కేవీపీ రామచంద్రరావు మాత్రం.. తెలుగుదేశానికి చెందిన ఏపీ శాసనసభ స్పీకరు కోడెల శ్రీనివాసరావు కు ఓ లేఖాస్త్రం సంధించారు. మరణించిన నేతల చిత్రపటాల్ని తొలగించడం సాంప్రదాయం కాదని అంటూ కోడెలకు ఘాటుగానే లేఖ రాశారు. సీఎంగా, ఎంపీగా పనిచేసిన ఆయన ఫోటో తొలగింపు సరికాదు అని ఆయన పేర్కొన్నారు. ఆఫోటోను తిరిగి తొలగించిన చోటనే పెట్టాలని కూడా అందులో పేర్కొన్నారు.