ముంబాయి పేలుళ్ల నిందితుడిని ఉరితీయాల లేదా క్షమాభిక్ష ప్రసాదించాలా? అనే విషయంలో సుదీర్ఘంగా సాగిన హైడ్రామాకు తెరపడింది. హైకోర్టు తీర్పు ప్రకారం.. అతడిని ఉరితీయాల్సిన సమయానికి కొన్ని గంటల ముందు వరకు ఈ విషయంలో హైడ్రామా కొనసాగింది. అటు ఉరిని కాస్తా యావజ్జీవ శిక్షగా మార్చి కాపాడండి అని వేడుకొన్న మెమన్ కుటుంబ సభ్యులకు, అతడిని ఉరి తీసి.. ముంబాయిపేలుళ్లలో మృతిచెందిన వారి ఆత్మలు శాంతించేలా చూడాలని కోరిన బంధువులకు ఇంతవరకు ఉన్న ఉత్కంఠ తొలగింది. మెమన్కు సుప్రీం న్యాయస్థానం ఉరిశిక్షను ఖరారుచేసింది. క్షమాభిక్ష కోసం యాకూబ్ మెమన్ పెట్టుకున్న క్యూరేటివ్ పిటిషన్ను తోసిపుచ్చింది.
యాకూబ్ మెమన్కు క్షమాభిక్ష విషయంలో హైడ్రామా ఎలా నడిచిందో అందరికీ తెలిసిందే. సోమ వారం ఈ కేసును విచారించిన ఇద్దరు జడ్జిల సుప్రీం బెంచ్, మంగళవారం కూడా విచారణ కొనసాగించింది. అప్పటికీ నిర్ణయం మాత్రం రాలేదు. ఒకరు అనుకూలంగా, ఒకరు ప్రతికూలంగా చెప్పడంతో.. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి.. ప్రత్యేకంగా ఒక త్రిసభ్య బెంచ్ ఏర్పాటుచేసి.. బుధవారం విచారించాల్సిందిగా చెప్పారు.
బుధవారం ఉదయం నుంచి ఇదే పనిమీద ఈ కేసును విన్నటువంటి ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ భోజనానంతరం 2గంటల తర్వాత కూడా వాదనలు విన్నది. వాదనలు పూర్తయ్యాక మధ్యాహ్నం సుమారు 3.40 గంటల సమయంలో కోర్టు తీర్పు వెలువడింది. మెమన్ పిటిషన్ను తోసిపుచ్చింది. ఇదివరకు శిక్ష విధించిన కోర్టులు జరిపిన విచారణ ప్రక్రియ సరిగానే ఉన్నదని తేల్చింది. దీంతో మెమన్కు ఉరి ఖరారైనట్లే.