హైదరాబాదులో ఏపీకి చెందిన నాయకులు ప్రముఖుల ఫోన్లను తెలంగాణ ప్రభుత్వం ట్యాపింగ్ చేయిస్తున్నదంటూ.. చంద్రబాబునాయుడు కొంత కాలం కిందట ఎంత పెద్ద రాద్ధాంతం చేశారో అందరికీ గుర్తుండే ఉంటుంది. ఓటుకు నోటు కేసు బయటపడినప్పుడు.. చంద్రబాబునాయుడు హఠాత్తుగా ఈ ట్యాపింగ్ అస్త్రాన్ని బయటకు తీశారు. దానిపై అసలు తెలంగాణ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అయిపోయేలా కొన్ని రోజుల పాటూ.. అదే పాట పాడుతూ ఉన్నారు. తీరా ఇప్పుడు వ్యవహారం ఒక కొలిక్కి వస్తోంది. ట్యాపింగ్ జరిగిన మాట వాస్తవమే అని అంగీకరిస్తూ.. కానీ దానిపై విజయవాడ కోర్టు విచారణ సాగించడం కుదర్దు అంటూ తెలంగాణ సర్కారు ఒప్పుకున్న తరువాత.. చంద్రబాబు నాయుడు మౌనంగా ఉండిపోయారు. మరోరకంగా చెప్పాలంటే ఆయన బిందాజ్గా ఉన్నారని పార్టీ నాయకులు అంటున్నారు.
ట్యాపింగ్ గొడవ గురించి తెదేపా నాయకులు రాద్ధాంతం చేస్తున్న సమయంలో తెరాస మంత్రులు చాలా రిటార్టులు ఇచ్చారు. ఫోను కాల్ రికార్డింగ్కు, ట్యాపింగ్కు తేడా తెలియకుండా మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. అది మొదలుగా వ్యవహారం చాలా దూరం వెళ్లింది. అటు ఏపీ సర్కారు సిట్ ఏర్పాటు చేసి.. సెల్ కంపెనీలను ముగ్గులోకి లాగింది. వ్యాపారం చేసుకునే సదరు ఆపరేటర్లు.. ఏ ప్రభుత్వంతోనూ వైరం పెట్టుకోలేక చేతులెత్తేశారు. చివరికి ట్యాపింగ్ ద్వారా ఆపరేటర్లనుంచి తాము సేకరించిన కాల్డేటా.. విజయవాడ కోర్టుకు వెళ్లిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఏమోననే సందేహంతో.. అలా జరగకుండా తెరాస సర్కారు హైకోర్టులో కేసు వేసింది.
తీరా కాల్డేటా మాత్రం హైకోర్టుకు వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది. ఒక రకంగా చూస్తే.. తెరాస ప్రభుత్వం పూర్తిగా ఇరుక్కున్నట్లే లెక్క. ట్యాపింగ్ చేశారనేది ఖరారైపోయింది. అయితే సరిగ్గా ఈ సమయంలో చంద్రబాబు కోటరీ సైలెన్స్న అయిపోయారు. శుక్రవారం కేబినెట్ మీటింగ్లో కూడా ట్యాపింగ్పై చర్చ జరిగింది. 'దీనిపై మనం గట్టిగా మాట్లాడాలి..' అంటూ చంద్రబాబు ఏదో ఒక సూచన చేశారు గానీ.. 'చట్టం తన పని తాను చేసుకుపోతుంది.. ' అంటూ దీన్ని ఇంకా పెంచేలా రాద్ధాంతంచేయడంపై తనకు ఆసక్తి లేనట్లుగా చంద్రబాబు సెలవిచ్చారు. ఎటూ తెలంగాణ సర్కారు ఇరుక్కున్నది కదా.. ఇక మనం అడిగినా అడగకపోయినా.. ట్యాపింగ్కు సంబంధించి.. వారి మీద తనుగుణమైన చర్యలుంటాయి... అనవసరంగా మనం అరవడం ఎందుకు.. అంటూ చంద్రబాబు వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నట్లు కనిపిస్తోంది.