పవన్ గత ఎన్నికలకు కొన్ని రోజుల ముందు హడావిడిగా పార్టీ పెట్టేశారు.. ఎన్నికల్లో గెలుపు తన లక్ష్యం కాదని.. అన్యాయాన్ని ప్రశ్నించడమే తన లక్ష్యమని ప్రకటించారు. ముందుగా అనుకున్నట్టే.. ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు. కానీ టీడీపీ- బీజేపీల గెలుపుకు సహకరించేశారు. ఎన్నికల తర్వాత కూడా ఆయన పొలిటికల్ గా యాక్టివ్ గా లేరు. 

ఎన్నికల తర్వాత టీడీపీ కూడా పవన్ కల్యాణ్ ను అంతగా పట్టించుకోవడం లేదు. పవన్ కూడా తన సినిమాల్లో బిజీగా ఉన్నాడు తప్ప.. పార్టీని ఓ శక్తిగా తయారు చేసే ఉద్దేశంలో ఉన్నట్టు కనిపించడం లేదు. ఏవో కీలక ఇష్యూలు ఉన్నప్పుడు అడపా దడపా ప్రెస్ మీట్లు, ట్వీట్లు తప్ప మిగతా ఎలాంటి కార్యాచరణ లేదు. రాజధాని భూముల్లో పర్యటించడం తప్ప ఆయన రాజకీయంగా చేసిందీ ఏమీ లేదు. 

ఈ నేపథ్యంలో.. పవన్ కళ్యాణ్ పై ఒక ప్రముఖ ఆంగ్ల పత్రిక సంచలన కథనం ప్రచురించింది. పవర్ స్టార్ పవర్ లెస్ పాలిటిషియన్ అయ్యారని శీర్షిక పెట్టి మరీ విశ్లేషణాత్మక కథనం ఇచ్చింది. ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగాలు, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలపై వ్యాఖ్యానిస్తూ పవన్ చెప్పిన విధంగా ప్రశ్నించలేకపోతున్నారని తేల్చేసింది. ప్రత్యేకించి రాజధాని భూముల విషయంలో ఆయన ప్రశ్నించలేకపోతున్నారని, కేవలం అభ్యర్ధనలు మాత్రమే చేయగలుగుతున్నారని పేర్కొంది.

ఏపీకి అత్యంతకీలకమైన ప్రత్యేక హోదా అంశాన్ని కూడా పవన్ పట్టించుకోవడం లేదని రాసింది. చంద్రబాబు నాయుడు సహా టీడీపీ నేతలు ఓటుకు నోటు కేసులో ఇరుక్కుంటే పవన్ కళ్యాణ్ కనీసం స్పందించలేకపోయాని కామెంట్ చేసింది. ఈ సందర్భంగా గతంలో ఆయన ప్రసంగిస్తూ, ఎవరికి అన్యాయం జరిగినా ప్రశ్నిస్తానని అన్న కొటేషన్ ను, ఇప్పుడు భూ సేకరణ విషయంలో చట్టం ప్రయోగించవద్దని విజ్ఞప్తి చేస్తున్నానని పేర్కొన్న మరో కొటేషన్ ను ప్రత‌్యేకంగా ఉదహరించింది. టోటల్ గా పవర్ స్టార్ కాస్తా పవర్ లెస్ స్టార్ గా మారారని అనాసిస్ చేసింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: