ఏపీ అసెంబ్లీ సమావేశాలు వైసీపీ నినాదాలు, నిరసనతో ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాలను పక్కనబెట్టి.. ప్రత్యేక హోదాపై చర్చించాలని ప్లకార్డులు ప్రదర్శించారు. దీనిపై స్పీకర్ వారించినా...వైసీపీ ఆందోళన కొనసాగిస్తోంది. క్వశ్చన్ అవర్ తర్వాత చర్చ మొదలుపెడదామని స్పీకర్ కోరినా...వైసీపీ సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. ప్రత్యేక హోదా రాష్ట్రాన్ని కుదిపేస్తున్న అంశమన్నారు వైసీపీ నేత జగన్. సమయం లేనందున ప్రశ్నోత్తరాలు సస్పెండ్ చేసి హోదా అంశంపై చర్చించాలని డిమాండ్ చేశారు.
ప్రత్యేక హోదా పై ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా చెప్పారు కాని, ఇంతకీ ఏమి చేస్తారో మాత్రం చెప్పలేదని అన్నారు. అబద్దాలు, అర్ధ సత్యాలతో చంద్రబాబు బండలు వేశారని ఆయన అన్నారు. శాసనసభలో ప్రత్యేక హోదాపై ఆయన మాట్లాడారు. గతంలో యూపీఏ ప్రభుత్వంపై 14 సార్లు అవిశ్వాస తీర్మానం ఇచ్చామన్నారు. అవిశ్వాస తీర్మానం ఎవరు ఇచ్చినా అందుకు 50 మంది మద్దతు అవసరమని తెలిపారు. అందుకే ఒక్కసారి కూడా అవిశ్వాస తీర్మానం అడ్మిట్ కాలేదని జగన్ వివరించారు.పచ్చకామర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని జగన్ వ్యాఖ్యానించారు. అవిశ్వాస తీర్మానానికి కనీసం 50 మంది మద్దతు కూడా లేని స్థితి అప్పటి పార్లమెంటులో ఉందన్నారు.
ఏపీ అసెంబ్లీ
చంద్రబాబు ఇక్కడ ఉండి అక్కడ ఎంపీలతో మాట్లాడిస్తారని ఆయన ఏం చేసినా చెల్లుబాటు అవుతుందన్నారు.జగన్ మాట్లాడుతుండగా.. టిడిపి సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మేం ఇవ్వాల్టి జనరేషన్, చంద్రబాబు గత జనరేషన్ అన్నారు. మేం (ఈ జనరేషన్) హోంవర్క్ చేస్తామని, డాక్యుమెంట్లు చూపిస్తామని జగన్ అన్నారు. చంద్రబాబు స్టడీ చేయరు, ఆయనకు అంత ఓపిక కూడా లేదన్నారు. మేం ఈ తరం వాళ్లం, చంద్రబాబు పాత తరం వారు ఆయనకు అన్నీ తెలియదని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రికి కూడా ప్రత్యేక హోదా గురించి పూర్తిగా తెలియదన్నారు.