త్వరలోనే వైసీపీ అధికారంలోకి వస్తుందని.. జనం కష్టాలు తీరతాయని జగన్ ఇటీవల తరచూ జనంతో చెబుతున్నారని పత్రికల్లో పలు కథనాలు వచ్చాయి. ఓ జ్యోతిష్యుడు చెప్పిన జ్యోతిష్యమే ఇందుకు కారణమని సోషల్ మీడియాలో కథనాలు షికార్లు చేస్తున్నాయి. ఐతే.. ఆ అధికారం ఎలా వస్తుందని.. ఏం జరుగుతుందనే దానిపై మాత్రం ఎవరికీ స్పష్టత లేదు. 

ఐతే.. జగన్ ఆశలన్నీ కల్లలేనని ఇటీవలే టీడీపీలో చేరిన మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ కుండబద్దలు కొడుతున్నారు. జగన్ అధికారం కావాలంటే 2019 వరకూ ఆగక తప్పదని డొక్కా నొక్కి వక్కాణిస్తున్నారు. టీడీపీలోకి చేరిన వెంటనే పార్టీ అధికారప్రతినిధి పదవి దక్కించుకున్న డొక్కా మాణిక్యవరప్రసాద్ కు గుంటూరులో ఘన స్వాగతం లభించింది. 

అసలు విషయం ఏంటంటే.. కొన్ని రోజుల క్రితం వరకూ డొక్కా కాంగ్రెస్ ను వదలి వైసీపీలోకే వెళ్దామనుకున్నారు. ఆ మేరకు వైసీపీ నేత  అంబటి రాంబాబుతో చర్చలు కూడా జరిగాయట. కానీ.. డొక్కా రాజకీయ గురువు టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావే డొక్కా టీడీపీ వైపు మొగ్గేలా చొరవ తీసుకున్నారట. అందుకే డొక్కా మొదటిసారి గుంటూరుకు వచ్చిన వేళ డొక్కాపై ప్రశంసలు కురిపించేశారు రాయపాటి. 

టీడీపీలో చేరిన తొలి ప్రెస్ మీట్లోనే డొక్కా జగన్ పై ఆరోపణలు సంధించారు. దీక్షల అంటే అల్టిమేట్ గా ఉండాలి.. నెలకో దీక్ష అంటే ఎలా.. అని జగన్ తీరును తప్పుబట్టారు. జ్యోతిష్యుల మాట విని అధికారంలోకి వస్తాననడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అన్నారు. ఇక్కడ కొసమెరుపేమిటంటే.. డొక్కా మాటలు వింటే.. 2019 తర్వాత జగన్ దే అధికారం అన్నట్టుగా ఉంది. అంతే కాదు.. ఓ రాజకీయ మిత్రుడిగా తొందరపాటు వద్దని జగన్ కు సూచిస్తున్నా అంటూ మాట్లాడటం పక్కనున్న టీడీపీ నేతలను కాస్త ఇబ్బంది పెట్టింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: