హిందూ సంస్కృతీ సాంప్రదాయాల్లో పుష్కరాలకు ఉన్న ప్రత్యేకత వేరే చెప్పనక్కర్లేదు. బ్రహ్మ దేవుడు సృష్టించిన పుష్కర సరస్సు పుష్కరంగా రూపాంతరం చెందిందని చెబుతారు.పాపాలను పోగొట్టే పుష్కరుడు దేవతల పాపాలనే కాదు, మానవుల పాప కర్మలను కూడా తొలగిస్తాడంటారు. అందుకే పుష్కర స్నానం కోసం భక్తులు వేయికళ్లతో ఎదురుచూస్తారు.
ఐతే.. ఆంధ్రప్రదేశ్ లో పుష్కరాలను పోలిన పవిత్ర నదీస్నానం మరొకటి ఉంది. పుష్కరాలు 12 ఏళ్లకు ఒకసారి వస్తే.. ఈ పవిత్ర స్నానం మాత్రం దాదాపు మూడు దశాబ్దాలకు ఒకసారి వస్తుంది. దీన్నే మహోదయం అంటారు. ఇది ప్రధానంగా శ్రీకాకుళం జిల్లా బారువలోని మహేంద్రతనయ నదీ, భీమిలి గోస్తని సంగమ ప్రాంతంలో జరుగుతుంది.
ఆదివారం రాత్రి 10గంటల 19 నిమిషాల నుంచి శ్రవణా నక్షత్రం కన్యాలగ్నంలో ప్రవేశించిన సమయం నుంచి మహోదయం ప్రారంభమైంది. ఈ పవిత్ర స్నాన ఉత్సవం ఉత్తరాంధ్ర ప్రజలకు అత్యంత ప్రధానమైన వేడుక. ఈ ప్రాంతంలో ఇది మరో పుష్కరంలాంటిదన్నమాట. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పుణ్య స్నానాలతో ఉత్తరాంధ్ర నదీ,సాగర తీరాలు కిక్కిరిసిపోతాయి.
పుష్కరాలు 12 రోజుల పాటు జరిగితే.. ఈ మహోదయం కేవలం 24 గంటలపాటు మాత్రమే ఉంటుంది. ఈ పవిత్ర స్నానాలకు ఆంధ్రా, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. శ్రీకాకుళం, విశాఖ జిల్లాలో నదీ, సాగర తీరాల్లో పవిత్ర స్నానాలు ఆచరిస్తారు.
ఈ మహోదయానికో కథ కూడా ప్రచారంలో ఉంది. శ్రీకాకుళం జిల్లా బారువ గ్రామంలో ఉన్న మహేంద్ర తనయ సాగర సంగమ ప్రాంతంలో గతంలో పాండవులు సంచరించారట.వారు విడిచిన బాణం వల్ల ఒక గోవు చనిపోయిందట.
గోహత్య పాపవిమోచన కోసం ఈ మహేంద్ర తనయ నదీ సంగమ స్థలంలో గోవుకి కర్మకాండలు చేపట్టి పుణ్య స్నానాలాచరించారట. ఆ సమయం మహోదయ పుణ్య కాలం కావడం వల్ల ఇక్కడే కోటిలింగేశ్వర ఆలయాన్ని నిర్మించి, మహాజ్ఞం చేసి జన్మరాహిత్యాన్ని పొందారని చెబుతారు. అప్పటి నుంచి మహోదయ పుణ్యస్నానాల సంప్రదాయం కొనసాగుతోంది.