అష్టాదశ శక్తి పీఠాలు -పురాణ కధ:


ఒకప్పుడు దక్షుడు బృహస్పతియాగం చేసినప్పుడు అందరినీ ఆహ్వానించాడు గాని కూతురినీ, అల్లుడినీ పిలవలేదు, ఎందుకంటే దక్షుని కుమార్తె సతీదేవి (దాక్షాయణి) తండ్రి మాటకు విరుద్ధంగా శివుడిని పెళ్ళాడింది. పుట్టింటివారు ప్రత్యేకంగా పిలవాలేమిటి? అని సతీదేవి, శివుడు వారించినా వినకుండా, ప్రమధగణాలను వెంటబెట్టుకొని యాగానికివెళ్ళింది గాని, అక్కడ అవమానానికి గురయ్యింది. ముఖ్యంగా శివనింద సహించలేక ఆమె యోగాగ్నిలో భస్మమైంది. విషయం తెలుసుకున్న శివుడు వీరభద్రుణ్ని సృష్టించి దక్షయాగాన్ని ధ్వంసం చేశాడు. సతీదేవి పార్థివదేహాన్ని భుజాన వేసుకుని ప్రళయతాండవం చేశాడు. ఉగ్రశివుణ్ని శాంతింపజేసేందుకు చక్రప్రయోగం చేసి , సతీదేవి శరీరాన్ని ఖండించాడు విష్ణువు. ఆ శరీర భాగాలు పడిన ప్రాంతాలే అష్టాదశ శక్తి పీఠాలు' అని చెబుతోంది దేవీభాగవతం.


కాని సతీ వియోగదుఃఖం తీరని శివుడు ఆమె మృతశరీరాన్ని అంటిపెట్టుకొని ఉండి తన జగద్రక్షణాకార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్ధనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్రసాధకులకు ఆరాధనా స్థలాలు అయినాయి. ప్రతి శక్తి పీఠంలోను దాక్షాయణీ మాత భైరవుని(శివుని)తోడుగా దర్శనమిస్తుంది.


శాంకరీదేవి...అష్టాదశ శక్తి పీఠాలలో ముందుగా చెప్పుకోవలసినది శక్తి స్వరూపిణి శాంకరీదేవి. నేటి శ్రీలంకలో ట్రింకోమలి పట్టణానికి సమీపంలో సముద్రంలోకి చొచ్చుకుని వచ్చినట్లున్న కొండపైన ఉన్న శిధిలాలయాన్నే శాంకరీ దేవి ఆలయంగా చెప్పబడుతుంది.ప్రస్తుతం అక్కడ స్తంభం మాత్రమే ఉంటుంది.అమ్మవారి "తొడభాగం" పడినస్థలంగా ప్రతీతి ఈ క్షేత్రం.

కామాక్షిసతీదేవి "వీపుభాగం" పడిన ప్రదేశం కాంచీపురం.ఇక్కడ అమ్మవారు కామాక్షిదేవిగా కొలువై ఉన్నారు.ఈ క్షేత్రం తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై పట్టణం నుండి 75కి.మీ దూరంలో ఉన్నది.అమ్మవారు ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి అర్చించి ఆ పుణ్యంతో కామాక్షి దేవిగా అవతరించి శివుణ్ణి వివాహం చేసుకుందని ప్రతీతి.

శృంఖలా దేవిఅమ్మవారి "ఉదరభాగం" పడిన చోటు ప్రద్యుమ్నం.ఈ క్షేత్రం గురించి రెండు భిన్న వాదనలు ఉన్నాయి.కొందరేమో గుజరాత్ లో ఉన్నది అని కాదు..కాదు పశ్చిమబెంగాల్ లో ఉన్నదై మరి కొందరు అంటారు.కానీ కలకత్తాకు 80కి. మీ దూరంలో హుగ్లీ జిల్లాలోని "పాండువా" అనే గ్రామంలో ఉన్నదే అసలైన క్షేత్రంగా భక్తులు విశ్వసిస్తారు.

చాముండేశ్వరికర్నాటక రాష్ట్రంలోని మైసూరు పట్టణంలో, ఆ ప్రాంత ప్రజలను హింసిస్తున్న మహిషాసురుడిని సం హరించడానికి సతి శక్తి చాముండేశ్వరి అమ్మవారిగా వెలిసిందని దేవి భాగవతం చెబుతుంది.హరుని రుద్ర తాండవంలో అమ్మవారి "తలవెంట్రుకలు" వూడి ప్రస్తుత మైసూరు ప్రాంతంలోని చాముండి పర్వతాలపై పడ్డాయని స్థలపురాణం చెబుతుంది.ఈ ఆలయంలో అమ్మవారు స్వర్ణవిగ్రహ రూపంలో కొలువైభక్తుల పూజలందుకుంటోంది.

జోగులాంబతెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలో కర్నూలుకు 10కి.మీ దూరంలో ఉన్న ప్రాచీన ఆలయం అలంపూర్ జోగులాంబ. సతీదేవి "దంతాలు" ఇక్కడ పడ్డాయని ప్రతీతి.ఇక్కడ నవబ్రహ్మ ఆలయాలు కూడా ఉన్నాయి.ఆలయంలోని గర్భగుడిలో ఆసీన ముద్రలో కొలువై ఉంటుంది జోగులాంబ.

భ్రమరాంబిక దేవికర్నూలు పట్టణానికి 80కి.మీ దూరంలో ఉన్న శ్రీశైలం ప్రముఖ శైవక్షేత్రం.ఈ క్షేత్రంలో అమ్మవారు భ్రమరాంబికగా నిత్య పూజలందుకుంటున్నారు.ఈ ప్రదేశంలో అమ్మవారి "మెడభాగం" పడినట్లు ప్రతీతి.అరుణాసురుడనే రాక్షసుడు ఇక్కడి ప్రజలను, మునులను ఆందోళనలకు గురి చేసేవాడు.రెండుకాళ్ళు, నాలుగుకాళ్ళు జీవులతో మరణం లేకుండా వరం పొందిన అతన్ని సంహరించడానికి అమ్మవారు తుమ్మెద(భ్రమరం) రూపంలో వచ్చి అతన్ని సంహరించింది.

పురుహూతికఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లలో సామర్లకోటకు 13కి.మీ దూరంలో పిఠాపురంలో సతీదేవి "పీఠభాగం" పడటం వల్ల పీఠికాపురంగా, కాలక్రమంలో పిఠాపురంగా ఈ ప్రాంతం పేరొందింది.ఇక్కడ అమ్మవారు పురుహూతికా దేవిగా హుంకారిణిగా పూజలందుకుంటున్నది. అమ్మవారి నాలుగుచేతుల్లో బీజపాత్ర, గొడ్డలి, తామరపువ్వు మరియు మధుపాత్ర ఉంటాయి.

ద్రాక్షారామంసతీదేవి "కణతల భాగం" పడిన ప్రదేశంగా అష్టాదశ పీఠాలలో 12వదిగా, పంచారామాలలో మొదటిదిగా ప్రసిద్ధి చెందిన క్షేత్రం ఇది. ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాలోని ద్రాక్షారామలో మాణిక్యాంబగా అమ్మవారు వెలిశారు.దక్షయజ్ఞంలో సతీదేవి ఆహుతి అయిన ప్రదేశం. భోగానికి, మోక్షానికి, వైభవానికి ప్రసిద్ధి చెందినది ఈ క్షేత్రం.

మహాలక్ష్మీమహారాష్ట్రలోని పూణేకి 300కి.మీ దూరంలో కొలహాపూర్ లో వెలిసిన అమ్మ మహాలక్ష్మీ అవతారం. ఇక్కడ సతీదేవి "నేత్రాలు" పడ్డాయని చెబుతారు.అమ్మవారి తలపై ఆదిశేషుడు తన ఐదు పడగలతో ఛత్రం పడుతున్నట్లు ఉంటాడు.నల్లని ముఖంతో దివ్యాభరణాలతో వెలిగిపోయే ఈ అమ్మవారిని చూడటానికి రెండు కన్నులు సరిపోవు. అందుకే కొలహాపూర్ ను "అవిముక్త క్షేత్రం" గా వ్యవహరిస్తారు.

ఏకవీరాదేవిమహారాష్ట్రలో నాందేడ్ సమీపంలోని మహోర్ కి 15కి.మీ దూరంలో వెలిసిన తల్లి ఏకవీరాదేవి. దక్షయజ్ఞంలో తనువు చాలించిన అమ్మవారి "కుడిచేయి" పడిన స్థలంగా ఇది ప్రతీతి.గుడిలో పెద్ద కన్నులతో గర్భగుడి పైకప్పును తాకేంత ఎత్తులో ఉండే శిరోభాగం మాత్రమే ఉంటుంది.

మహాకాళిఉజ్జయినీ నగరంలో సతీదేవి యొక్క "పైపెదవి" పడిన స్థలంగా దేవిభాగవతం చెబుతుంది.మధ్యప్రదేశ్ లోని ఇండోర్ పట్టణానికి 50కి.మీ దూరంలో మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, మహాకాళి ఆలయం ఉన్నాయి.పూర్వం అంధకాసురుడు అనే రాక్షసుడితో మహాకాళేశ్వరుడు యుద్ధం చేస్తాడు.కానీ బ్రహ్మదేవుని వరం కారణంగా అంధకాసురుని రక్తం ఎన్ని చుక్కలు నేలను తాకితే అంతమంది రాక్షసులు పుట్టుకొస్తారు.అప్పుడు ఆదిపరాశక్తి కాళికాదేవి అవతారం దాల్చి యుధ్ధభూమిలో ప్రవేశించి తన పొడవైన నాలుకను చాచి అంధకాసురుడి రక్తం ఒక్క బొట్టు కూడా నేల చిందకుండా తాగేసిందని స్థలపురాణం.

మాధవేశ్వరిఅమ్మవారి "కుడిచేతి నాలుగువేళ్ళు" ప్రయాగ(అలహాబాద్) ప్రాంతంలో పడినట్లు దేవిభాగవతం చెబుతుంది.సతీదేవి వెళ్ళు పడిన ఈ ప్రదేశంలో కట్టిన ఈ ఆలయంలో విగ్రహం ఉండదు.నాలుగు దిక్కులా సమానంగా ఉన్న ఒక పీఠం మాత్రమే ఉంటుంది.దానిపై ఒక వస్త్రాన్ని హూండిలాగా వేలాడదీసి కింద ఉయ్యాల కడతారు.భక్తులు అక్కడే దీపారాధనలు చేసి అమ్మవారిని కొలిచినట్లు తృప్తి చెందుతారు. తాము తెచ్చిన కానుకలను ఊయలలో పెడతారు.

గిరిజా దేవినేటి ఒరిస్సా రాష్ట్రంలో కటక్ సమీపంలోని వైతరణీనది ఒడ్డున అమ్మవారు త్రిశక్తి స్వరూపిణిగా వెలిసింది.ఈ ప్రాంతాన్ని వైతరణీపురం అని కూడా అంటారు.ఒరిస్సాలోని జాజిపూర్ రోడ్డు నుంచి 20కి.మీ దూరం ప్రయాణిస్తే గిరిజాదేవి(ఇక్కడ భిరిజాదేవిగా ప్రసిద్ధి)ఆలయానికి చేరుకోవచ్చు.సతీ దేవి "నాభీస్థానం" ఇక్కడ పడిందని అంటారు.అమ్మవారి ముఖం మాత్రమే కనిపించేలా మిగతా విగ్రహాన్ని పూలతో, దండలతో మరియు బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు.

కామాఖ్యాఅస్సాం రాష్ట్రం రాజధాని గౌహతి పట్టణంలో బ్రహ్మపుత్రా నది ఒడ్డున నీలాచల పర్వత శిఖరం పై సతీదేవి "యోనిభాగం" పడిందని ప్రతీతి.నీలాచలంలోని గర్భగుడిలో యోని వంటి శిలఒకటి ఉంది.ఆ శిల నుండి సన్నని ధారగా జలం వస్తుంది.ఏటా వేసవి కాలంలో మూడు రోజుల పాటు ఎర్రని నీరు వస్తుంది.అమ్మవారు రజస్వల అయ్యిందని, ఈ మూడు రోజులు దేవాలయాన్ని మూసి ఉంచుతారు.నాలుగో రోజున సంప్రోక్షణ జరుపుతారు.

వైష్ణవీదేవిసతీదేవి "పుర్రె" పడిన ప్రదేశం. జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రంలో జమ్మూకు 50కి.మీ దూరంలో కాట్రా అనే ప్రదేశంలో ఉంది ప్రాంతం.అక్కడి నుండి గుర్రాల మీద లేదా హేలీకాప్టర్లో కొండపైకి వెళ్ళి జ్వాలాముఖి లేదా వైష్ణో దేవి ఆలయాన్ని దర్శించుకోవచ్చు.ఈ ఆలయంలో గుహ ఉంది.నాడు మొఘల్ చక్రవర్తి అక్బర్ పాదుషా చేయించి, తన స్వహస్తాలతో మోస్తూ కొండపైకి నడిచి వెళ్ళి అమ్మవారికి సమర్పించిన వెండి గొడుగు నేటికీ ఈ ఆలయంలో ఉంది.

మంగళగౌరీబీహార్ రాష్ట్రంలో పాట్నాకు 75కి.మీ దూరంలో గయా క్షేత్ర శక్తి స్వరూపిణిగా మంగళగౌరి కొలువుదీరి ఉంది.సతీదేవి "స్తనం" పడిన ప్రదేశం.దగ్గరలో బుద్ధగయ, బోధి వృక్షం, బౌద్ధాలయాలు ఉన్నాయి. గయలో పితృదేవులకు పిండ ప్రధానం చేయాలని ప్రతి హిందువూ కోరుకుంటాడు.

విశాలాక్షిసతీదేవి "మణికట్టు" పడిన స్థలం కాశీ పుణ్యక్షేత్రం.శివుని విశిష్ట స్థానంగా కాశి/వారణాశి విరాజిల్లుతోంది.వరుణ, అసి అనే రెండు నదుల సంగమం.గంగాస్నానం, విశ్వేశ్వరుడు, విశాలాక్షి దర్శనం నయనానందకరం.శుభకరం.

సరస్వతీఇక్కడ సతీదేవి "చేయి" పడిందని కొందరు, కుడిచెంప పడిన స్థలమని కొందరు చెబుతారు.పురాణేతిహాసాల వల్ల అమ్మవారి ఆలయం కాశ్మీర్ లో ఉందని తెలుస్తోంది.కానీ ఆ ఆలయం ధ్వంసం అవడంతో అక్కడ పూజలు జరగటంలేదని శంకరాచార్యులు ఆ పీఠాన్ని శృంగేరిలో(కర్ణాటక రాష్ట్రంలో) ప్రతిష్టించారని తెలుస్తోంది. మంగుళూరుకు 100కి.మీ దూరంలో సరస్వతీ ఆలయ రూపకల్పన చేసి, ఒక రాయిపై చక్ర యాత్ర స్థాపన చేసి,సరస్వతీదేవి చందనపు విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసారు.


మరింత సమాచారం తెలుసుకోండి: