"చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశః" అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత 4వ అధ్యాయంలో స్పష్టంగా చెప్పిన ప్రకారం బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే నాలుగ వర్ణాలు ఆయా వ్యక్తుల యొక్క గుణాలను బట్టి, వారు చేసే పనులను బట్టి విభజించబడినవి. అంతే తప్ప ఇందులో ఏ వర్ణమూ కూడా ఒకటి ఎక్కువ, మరొకటి తక్కువ అని చెప్పబడలేదు. ఇవి కాలక్రమంలో మనలోని సంకుచిత స్వార్ధబుద్ధుల కారణంగా దుష్ఫలితాలకు దారితీసాయి. బౌద్ధిక కర్మల కంటే భౌతిక కర్మలను కార్మికుల వలె ఆచరించే శూద్ర విభాగానికి ఈ ఉపనయన సంస్కారం గాని, దీనికి సంబంధించిన నియమాలు కాని అవసరం లేదని దీని భావం. ధీ శక్తి (బుద్ధి శక్తి)కి అధికంగా ప్రాధాన్యతగల కర్మలను ఆచరించే - అనగా సమాజ హితకమైన కార్యక్రమాలు రూప కల్పన చేసి ఆచరింపజేసే బ్రాహ్మణ వర్ణానికి, పర్యవేక్షణ రక్షణాదుల బాధ్యత వహించే క్షత్రియ వర్ణానికి, సమాజ పోషణ, స్థితిగతులకు తోడ్పడే వైశ్య వర్ణానికి ఈ సంస్కార, నియమాలు తప్పనిసరి అని గ్రహించాలి తప్ప ఇక్కడ ఎక్కువ తక్కువ వివక్ష లేదు.
వేదమంత్రాలపై పట్టు సాధించాలంటే ఎన్నో నియమ నిష్ఠలు, ఆచారాలు పాటించాలి. వేదాధ్యయనానికి గురుకులంలో 12సంవత్సరములు క్రమశిక్షణతో కూడిన బ్రహ్మచర్య దీక్ష అవసరం. కనుక ఉపనయన సంస్కారం తప్పనిసరి. పరంపరాగతమైన వ్యవసాయం, కమ్మరం, కుమ్మరం, చాకలి, మంగలి, మొదలైన కులవృత్తి విద్యలను నేర్వటానికి ఇన్ని నియమ నిష్ఠలు, ఆచారాలు, గురుకులవాసాలు అక్కరలేదు. తల్లిదండ్రుల నుండి లేక కుల పెద్దల నుండి ఈ విద్యలను తక్కువ కాలంలో నేర్వవచ్చు. కనుక ద్విజులు కాని వారికి ఈ ఉపనయన సంస్కారము అవసరం లేదు. ఈ సంస్కారం పొందనందున శూద్రులకు ఏవిధమైన నష్టము కాని, తక్కువతనం కాని లేదు.
"స్వకర్ణమా తమ భ్యర్చ్య సిద్ధింవిందతిమానవః" అనే గీతా శ్లోకం (18-46) ఇట స్మరణీయము.