బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఫ్రీడమ్ సిరీస్ రెండో టెస్ట్ మ్యాచ్లో భారత స్పిన్నర్లు రాణిస్తున్నారు. టీ విరామానికి దక్షిణాఫ్రికా కోల్పోయిన ఏడు వికెట్లలో ఆరు వికెట్లను స్పిన్నర్లు నేలకూల్చి తమ సత్తాను మరోసారి చాటుకున్నారు. ఫ్రీడమ్ సిరీస్ రెండో టెస్ట్ మ్యాచ్లో పర్యాటక సౌతాఫ్రికా జట్టు తన తొలి ఇన్నింగ్స్లో 214 పరుగులకు ఆలౌట్ అయింది. టాస్ గెలిచిన భారత్ తొలుత దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కు ఆహ్వానించింది.
దీంతో బ్యాటింగ్ ఆరంభించిన దక్షిణాఫ్రికా ఎనిమిది ఓవర్లలోపే రెండు వికెట్లు కోల్పోయి ఆదిలోనే తడబడింది. ఆ తరువాత ఆమ్లా-ఎల్గర్ లు మరమ్మత్తులు చేపట్టారు. కాగా, 15 ఓవర్ లో ఆమ్లా మూడో వికెట్ రూపంలో పెవిలియన్ కు చేరడంతో దక్షిణాఫ్రికాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. దీంతో దక్షిణాఫ్రికా 177 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. డివిలియర్స్ ఒక్కడే నిలదొక్కుకుని హాఫ్ సెంచరీ మార్కును చేరాడు. 105 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్సర్ తో 85 పరుగులు చేశాడు.
రవీంద్ర జడేజా, రవి చంద్రన్ అశ్విన్ లు తలో మూడు వికెట్లు తీసి దక్షిణాఫ్రికా వెన్నువిరిచారు. వందో టెస్టు ఆడుతున్న ఏబీ డివిలియర్స్(85) ఏడో వికెట్ గా పెవిలియన్ కు చేరాడు. దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో వేన్ జిల్(10), ఎల్గర్(38),డుమనీ (15), ఆమ్లా (7), డుప్లెసిస్ (0), విలాస్(15)లు నిరాశపరిచారు. భారత పేస్ బౌలర్లలో వరుణ్ ఆరోన్ కు ఒక వికెట్ లభించింది. తొలి ఇన్నింగ్స్లో అశ్విన్, జడేజాలు నాలుగేసి వికెట్లు తీయగా, అరోన్ ఓ వికెట్ తీశాడు.