బ్యాడ్మింటన్ గేమ్ కి ప్రచారం కల్పించి దాని అభివృద్ధి కోసం ప్రకాశ్ పదుకొనే కృషి చేశారు. ఆయన చేసిన కృషికి నేడు ఫలితం దక్కింది. దీనికి సంబంధించి ఆయనను మొదటి జీవిత సాఫల్య పురస్కార విజేతగా ఎంపిక చేశారు. ఈ విషయాన్ని బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ) ప్రకటించింది.
ఆయనకు అవార్డు ఇవ్వడంలో భాగంగా జ్ఞాపికతో పాటు రూ. 10 లక్షల నగదు బహుమతిని అందించనున్నారు. ఈ మేరకు బీఏఐ అధ్యక్షుడు హిమంతా బిస్వా శర్మ వెల్లడించారు. ఈ ఏడాది నుంచి ప్రతి ఏడాది బ్యాడ్మింటన్ అభివృద్ధి కోసం పాటుపడిన వారికి జీవిత సాఫల్య పురస్కారం అందజేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా పేర్కొన్నారు.ఈ వేడుకను ఢిల్లీలో నిర్వహించనున్నారు.
అక్కడే ప్రకాశ్ పదుకొనేకి సన్మానం చేయనున్నామని తెలిపారు. 1980లో ఆల్ ఇంగ్లండ్,1983లో వరల్డ్ ఛాంపియన్ షిప్ లో ప్రకాశ్ పదుకొనే పతకాలు సాధించారు. అందుకుముందు 1978లో కామన్వెల్త్ క్రీడల్లో మెడల్స్ సాధించారు. ఆయనను 1972లో అర్జున అవార్డు, 1982లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించారు.