ప్రపంచంలోని పలు రంగాలకు చెందిన నిపుణుల మధ్య అనుసంధాన కర్తగా సత్తా చాటుతున్న ‘లింక్ డ్ ఇన్’ ఇకపై టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తో కలిసి తన తదుపరి ప్రయాణం సాగించనుంది. ఈ మేరకు లింక్ డ్ ఇన్ ను తాము కొనుగోలు చేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల నిన్న అమెరికాలోని న్యూయార్క్ లో సంచలన ప్రకటన చేశారు. ఇందుకోసం రూ.2,620 కోట్ల డాలర్లు (రూ.1.75 లక్షల కోట్లు) వెచ్చిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ డీల్ మైక్రోసాఫ్ట్ టేకోవర్ల జాబితాలోనే అతి పెద్దదిగా రికార్డులకెక్కనుంది. 



అమెరికాలోని న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజీలో గత శుక్రవారం నాటి ముగింపు ధరతో పోలిస్తే మైక్రోసాఫ్ట్ చెల్లింస్తున్న ప్రీమియం దాదాపు 50 శాతం అధికం కావడం గమనార్హం. మరోపక్క, విశిష్టమైన లింక్డ్‌ఇన్ బ్రాండ్‌ను యథాతథంగా కొనసాగించనున్నామని.. స్వతంత్ర కంపెనీగానే కొనసాగించనున్నట్లు కూడా మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. ప్రస్తుతం కంపెనీ సీఈఓగా వ్యవహరిస్తున్న జెఫ్ వీనర్ బాధ్యతల్లో ఎలాంటి మార్పులూ ఉండబోవని.. ఆయన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఆధ్వర్యంలో పనిచేస్తారని కంపెనీ వివరించింది. 



లింక్డ్‌ఇన్ సహ-వ్యవస్థాపకుడు మెజారిటీ వాటాదారుతో పాటు చైర్మన్ కూడా అయిన రీడ్ హాఫ్‌మన్, వీనర్‌లు ఇరువురూ ఈ డీల్‌కు పూర్తి మద్దతు       తెలిపారని మైక్రోసాఫ్ట్ ప్రకటన పేర్కొంది. ఈ ఏడాది చివరికల్లా ఒప్పందం పూర్తవుతుందని అంచనా. మైక్రోసాఫ్ట్ అనుబంధ విభాగం ‘మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 360’తో కలిసి లింక్ డ్ ఇన్ పనిచేయనుంది. ఈ డీల్ ను ప్రకటిస్తున్న సందర్భంగా సత్య నాదెళ్ల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను మొదటి నుంచి లింక్ డ్ ఇన్ కు పెద్ద అభిమానిని అని పేర్కొన్నారు. లింక్ డ్ ఇన్ తో కలిసి కొత్త అవకాశాలను సృష్టిస్తామని కూడా సత్య ప్రకటించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: