ఈ రోజుల్లో ఫోను వాడకం తప్పనిసరి అవసరమయ్యింది. కొన్ని కుటుంబాల్లో మూడు నాలుగు రకాల ఫోన్లు ఉంటున్నాయి. సాధారణంగా ల్యాండ్ లైన్ ఒకటి ఇంట్లో ఉంటుంది. ఇది కాకుండా భార్యాభర్తల దగ్గర సెల్ ఫోన్లు ఉంటున్నాయి. కొందరి ఇళ్లలో పిల్లల దగ్గర కూడా సెల్ ఫోన్లు ఉంటున్నాయి. ఒకే మనిషి రెండు మూడు ఫోన్లు కూడా మెయింటెయిన్ చేస్తున్నాడు. సెల్ ఫోన్ కంపనీలు రకరకాల ఆఫర్లతో ముందుకు వస్తున్నాయి. దీనితో కొందరు ఫోన్లని కూడా మార్చేస్తున్నారు. కొత్త ఫోన్లు కొంటున్నారు. ఆఫర్ల ఆకర్షణకు లోనయి అవసరమున్నా లేకున్నా మరో సెల్ ఫోన్ కొంటున్న వారి సంఖ్య బాగా పెరిగి పోతుంది. దీనితో నెల వారి బిల్లు మనకు తెలియకుండానే అధికంగా చెల్లిస్తున్నాం.
అయితే ఫోన్లు కొనడంలో, వాడకంలో, నిర్వహణలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే నెల తిరిగేసరికి ఫోను బిల్లు తడిసి మోపెడు అవుతుంది. పర్సు బరువు తరిగి పోతుంది.
- ఇంట్లో ల్యాండ్ లైన్ ఉంటుంది. బయట భర్త లేదా భార్య దగ్గర ఉన్న సెల్ కు ఫోన్ చేస్తుంటారు. అయితే ల్యాండ్ లైన్ నుంచి సెల్ ఫోనుకు ఫోను చేస్తే చార్జీ ఎక్కువ పడుతుంది. కనుక సెల్ టు సెల్ చేయడమే ఉత్తమం. లేదంటే అవసరం ఉన్నంత వరకే మాట్లాడాలి. మాట్లాడటం అయిన తర్వాత నువ్వు పెట్టు అంటే నువ్వు పెట్టేయి అనుకుంటూ ఉంటే మీకు తెలియకుండానే సెల్ ఫోన్ బిల్లు పెరిగిపోతుంది.
- సెల్, ల్యాండ్ లైన్ ఉన్నవారు ఎప్పుడైనా బిల్లు ఎక్కువ రాగానే ఏదో ఒకటి తీసేయాలనుకుంటున్నారు. బిల్లు ఎక్కువ వస్తుంది కాబట్టి ఏదో ఒక ఫోన్ కట్ చేయడం మార్గంగా తలపోస్తారు. కానీ ఇది పరిష్కారం కాదు. ఎందుకంటే ల్యాండ్ లైన్ ఉండగా సెల్ ఎందుకు తీసుకుంటారు, అవసరం కాబట్టి , అవసరాలను బట్టి తగ్గించుకోవడం కాకుండా అవసరమయినంత మేరకు ఉపయోగించుకోవడం మంచిది.
- ఇంట్లో సెల్, ల్యాండ్ లైన్ ఉన్నప్పుడు ల్యాండ్ లైన్ నెంబర్లకు ల్యాండ్ లైన్ నుంచి చేయాలి. సెల్ ఉన్నవారికి సెల్ నుండి చేయాలి. సెల్ నుండి ల్యాండ్ లైనుకు చేసినా, ల్యాండ్ లైన్ నుంచి సెల్ కు చేసినా కాల్ చార్జీలు ఎక్కువ పడతాయి.
- దూర దేశాలకు, దూర ప్రాంతాలకి ఫోను చేసినపుడు బిల్లు పెరుగుతుందన్న సంగతి గుర్తు పెట్టుకోవాలి. అవతలి వ్యక్తులు ఫోన్ చేసినపుడు సోది చెప్పకుండా నేరుగా అసలు విషయాలే మాట్లాడాలి.
- మీరు అందించాల్సిన సమాచారం చిన్నదయితే ఎస్.ఎం.ఎస్ ఇవ్వండి. అత్యవసరమయితేనే ఫోన్ చేయండి.
- దూర ప్రాంతాల్లో ఉన్న ఫ్రెండ్స్ కి సమాచారం అందజేయడానికి ఫోను చేయడం కన్నా ఈ మెయిల్ ఇస్తే మంచిది. అత్యవసరం కాని విషయాన్ని చెప్పడానికి ఈ రకమైన పద్దతిని అనుసరించాలి. పిల్లలకు కూడా ఫోనులో ఎంతసేపు మాట్లాడాలో చెప్పాలి.
- అవసరమైనంత మేరకు మాత్రమే ఫోన్ మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. అనవసరపు విషయాలు ఫోన్లో ఏకరవున పెట్టడం మంచిది కాదని తెలియజేయాలి.
- ఒక ఫ్రెండ్స్ ను కలిసి గంటసేపు మాట్లాడాల్సిన విషయాల్ని ఫోనులో మాట్లాడటం కన్నా కలిసి మాట్లాడటం మంచిది. ఫోన్ లోనే మాట్లాడక తప్పని సమయమైతే ఫోన్ లో ఎక్కువ సేపు మాట్లాడాలి.
- కొన్ని మొబైల్ ఫోన్ కంపనీలు కొన్నాళ్లపాటు ఔట్ గోయింగ్ కాల్స్ ను ఉచితంగా అందజేస్తున్నాయి. అందుకని కొందరు రెండో సెల్ కొంటున్నారు. ఈ విధాంలోగా రెండవ ఫోన్ కొనేటప్పడు ఆలోచించుకోవాలి. ఆఫర్ ఉందని కొన్నాదాని వల్ల ప్రయోజనం వుందో లేదో తేల్చుకోవాలి.
- కొందరు తమకు వున్న సెల్ ఫోన్ల స్థానంలో కొత్తది కొనాలనుకుంటున్నారు. మార్కెట్లోకి రకరకాల పేర్లతో రకరకాల స్కీమ్ లతో ఎప్పటికప్పుడు కొత్తరకాలుగా వస్తున్నాయి. వీటిని కొనాలని చాలా మంది కొనాలని అనుకొంటున్నారు. కానీ తమ అవసరాన్ని ప్రాతిపదికగా తీసుకోవాలి. తాత్కాలికంగా చేతిలో డబ్బులు ఉన్నా వాటిని కొనడం ఎంత వరకు అవసరమో ఆలోచించాలి. అలాగే తమ ఆర్థిక ప్రాధాన్యాల్ని దృష్టిలో వుంచుకోవాలి.
- ఫోన్లు ఉండటం వలన మనుషుల్లో సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. మనుషులు సన్నిహితులు అవుతారు. సమాచారం తెలుస్తుంది. అందుకని ఫోన్లు ఉండాలి. అయితే బిల్లులు పెరగకుండా చుసుకోవాలి. సంయమనంతో వాడటం నేర్చుకోవాలి. అపరిచితులయిన వారి సెల్ కు ఫోన్ చేసినపుడు వారితో ముందుగా సారీ మీరు ఎవరో తెలుసుకోవచ్చా అని అడిగి తెలుసుకోవాలి ఆ తర్వాతే సంభాషణ ప్రారంభించాలి.
- ఇతరుల అనుమతి లేకుండా ఎవరి సెల్ నెంబరు కూడా మరొకరికి ఇవ్వకూడదు.
- ఉదయం ఎనిమిది గంటలోపు, రాత్రి పది గంటల తర్వాత అత్యవసరమైతే తప్ప ఫోను చేయకూడదు. అలాగే మధ్యాహ్నం సమయం , ముఖ్యంగా ఆదివారం మధ్యాహ్నలు ఎంతో పనివుంటే తప్ప ఎవరికీ ఫోను చేయకూడదు.