ఆపద మొక్కుల వాడు... అందరివాడు... ఏడుకొండల పైన వెలసిన శ్రీ వేంకటేశ్వరుడు. తెలుగు వారితోపాటు భారత దేశమే కాక విదేశీ భక్తుల పాలిట కూడా కొంగు బంగారమే ఈ శ్రీనివాసుడు. రెండుగా విడిపోయిన తెలుగుజాతి వెంకటేశ్వరుడి పాలక మండలిలోనూ మార్పులకు కారణం కానుంది. దేవ దేవుడి అభివృద్ధి, పర్యవేక్షణనూ తిరుమల తిరుపతి దేవస్థానం - టీటీడీ చూసుకుంటుంది. కొత్తగా ఏపీ ప్రభుత్వ పగ్గాలు అందుకున్న చంద్రబాబు సర్కార్... రాష్ట్రంలో అన్ని దేవాదాయ కమిటీలనూ రద్దు చేసింది. దీంతో టీటీడీ పాలక మండలి కూడా ఆ జాబితాలో చేరింది. ఇప్పుడు కొత్తగా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం నూతన పాలక మండలిని ఏర్పాటు చేయనుంది. ఇందులో తెలంగాణకు చోటు కేటాయించాలా...? వద్దా...? అనేదే ఇప్పుడు బాబు ప్రభుత్వాన్ని ఆలోచనకు గురి చేస్తున్న పెద్ద ప్రశ్న. మొన్నటి దాకా టీటీడీ పాలక మండలిలో ఉమ్మడి రాష్ట్రంతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచీ ఇద్దరు సభ్యులను తీసుకునేవారు. అయితే ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో సహచర తెలుగు రాష్ట్రమైన తెలంగాణను కూడా పొరుగు రాష్ట్రంగానే భావించాలా...? లేదంటే గతంలో మాదిరిగా టీటీడీలోకి ఆహ్వానించాలా...? అనే అంశం పై ఏపీ ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. భౌగోళికంగా తిరుమల రాయలసీమలో ఉన్నప్పటికీ వెంకటేశ్వరుడి దర్శనానికి మాత్రం దేశ, విదేశాల నుంచీ భక్తులు విరివిగా వస్తుంటారు. దీంతోపాటు టీటీడీకి తెలంగాణలోనూ పెద్ద మొత్తంలో ఆస్తులు ఉన్నాయి. అందుకే తెలంగాణ నుంచి ఒక ఉన్నతాధికారిని పాలక మండలిలోకి తీసుకుంటే బాగుంటుందనే ఆలోచన చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. గతంలో టీటీడీ పాలక మండలిలో రాష్ట్రంతోపాటు కర్ణాటక, తమిళనాడు, ఉత్తరాది రాష్ట్రాల నుంచి కూడా సభ్యులను తీసుకునేవారు. అయితే ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం లేదు. తెలంగాణ నుంచి కూడా పొరుగు రాష్ట్రాల మాదిరిగానే ఇద్దరు సభ్యులకు అవకాశం కల్పిస్తే ఎలా నిర్ణయించాలి అనేది ఆలోచిస్తున్నారు. నేరుగా తామే సభ్యులను నామినేట్ చేయడమా...? లేకుంటే సభ్యులను ప్రతిపాదించమని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరడమా...? అనేది తేల్చుకోలేకపోతున్నారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి ప్రతిసారీ ఇద్దరు సభ్యులకు మండలిలో ప్రాతినిధ్యం దక్కుతోంది. తెలంగాణకు కూడా అదే విధంగా స్థానం కల్పించాలని... సభ్యులను సైతం తామే నామినేట్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయంలో ఏపీ అధికారులు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: