భారత వాహన మార్కెట్లో ఫెయిల్యూర్ మోడల్ గా ముద్రపడిన బజాజ్ డిస్కవర్ 100 సీసీ బైక్ పై సంస్థ ఎండీ రాజీవ్ బజాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డిస్కవర్ బైక్లో 100 సీసీ వేరియంట్ను విడుదల చేయడం తన కెరీర్లోనే అతిపెద్ద తప్పిదమని బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ పేర్కొన్నారు. ద్విచక్ర వాహన మార్కెట్లో తమ కంపెనీ రెండో స్థానానికే పరిమితం కావడానికి ఆ బైకే కారణమన్నారు. గురువారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాజీవ్ బజాజ్ తన అంతరంగాన్ని బయటపెట్టారు. డిస్కవర్ 125 సీసీలో విడుదల చేయగా చాలా మంచి స్పందన వచ్చిందని, ఆ సమయంలో 100 సీసీ బైక్ వస్తే, విక్రయాలు ఇంకా పెరుగుతాయని మార్కెట్ వర్గాలు చెప్పడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన గుర్తు చేసుకున్నారు.
దాంతో కంపెనీ తన స్థానాన్ని, ఐదేళ్ల తర్వాత పనితీరునూ కోల్పోయింది. లేదంటే, సంస్థ ప్రస్తుత పరిస్థితి మరింత మెరుగ్గా ఉండేది’’ అని ఆయన అన్నారు. ఈ బైక్ కారణంగా గడచిన ఐదేళ్లలో తమ స్థానాన్ని, పనితీరును నష్టపోయామని అన్నారు. కేటీఎం విషయంలో మాత్రం విజయం సాధించామని, ఈ సంవత్సరం హార్లే డేవిడ్ సన్ బైక్ లు 2.40 లక్షలుకాగా, కేటీఎం అమ్మకాలు 2.7 లక్షల యూనిట్లను దాటాయని రాజీవ్ బజాజ్ వ్యాఖ్యానించారు. అయితే కేటీఎం భవిష్యత్పైన మాత్రం ఆశాజనకంగా ఉన్నట్లు బజాజ్ చెప్పారు.
ఆస్ట్రేలియాకు చెందిన రేసింగ్ బైకుల తయారీ కంపెనీ కేటీఎంలో బజాజ్ ఆటో 2007లో పెట్టుబడులు పెట్టింది. వచ్చే సంవత్సరంలో తాము బ్యాటరీతో నడిచే వాహనాలను ఉత్పత్తి చేస్తామని ఆయన తెలిపారు. ఇ-వాహనాలపై పరిశ్రమ సవతి తల్లి ప్రేమను చూపుతోందని చెప్పిన ఆయన, 2019లో 'టెస్లా' టూ లేదా త్రీ వీలర్ వెహికిల్స్ లోకి వస్తుందని చెప్పారు. ఇక నాసిరకం వేరియంట్లను విడుదల చేస్తూ ఇండస్ట్రీ ఈ-బైక్ల పట్ల సవతి తల్లిలా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. ఎలక్ట్రిక్ వాహన రంగంలో అంతర్జాతీయంగా పేరున్న టెస్లా కంపెనీ స్థాయి ప్రమాణాలతో ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు తయారు చేస్తామని ఆయన అన్నారు.