చర్మం గురించి మనకెన్నో బెంగలుంటాయి. ఏ చిన్న తేడా కనిపించినా తెగ ఇదైపోతాం. అలాగే చాలా మంది మహిళలు ఎప్పుడు అందంగా, ఫ్రెష్ గా ఉండాలని సమయం సందర్భం లేకుండా మొహం కడిగేసుకుంటుంటారు. కొందరైతే.. రోజుకు నాలుగు సార్లు ముఖాన్ని సబ్బుతో రుద్దేస్తుంటారు. అయితే ఎక్కువ సబ్బుల్లో గాఢత ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ రసాయనిక సబ్బులను వాడడం వల్ల.. శుభ్రంగా ఉండే మాట పక్కన పెట్టి, లేనిపోని సమస్యలు ఎదుర్యే అవకాశం లేకపోలేదు.
ఎందుకంటే, ఏవిషయంలోనైనా అతి పనికిరాదని పెద్దలు ఊరికే అంటుంటారా. ఫేస్ వాష్ విషయంలో కూడా అంతే..! సమయం సందర్భం లేకుండా ముఖం కడుక్కోవడం వల్ల చర్మంపై పేరుకునే దుమ్ము పోయిశుభ్రంగా ఉంటుంది. దీన్నే చాలా మంది నమ్ముతారు. కానీ, అది పొరపాటు. ఎందుకంటే, ఎక్కువ సార్లు ముఖం కడుక్కోవడం వల్ల చర్మం ఉత్పత్తి చేసే ‘సెబమ్' అనే ద్రవం తగ్గిపోతుంది. ఫలితంగా చర్మం సంబంధిత వ్యాధులు. అంతే కాకుండా చర్మం మరింత పొడిబారిపోయి, గరుగ్గా మారిపోవచ్చు.
అందుకే సాధ్యమైనంత వరకూ బాగా అవసరం అనిపిస్తేనే ఫేస్ వాష్ చేసుకోవడం ఉత్తమం. సబ్బు చర్మం మీద మురికిని వదిలించాలి గానీ సహజ నూనెలను తొలగించకూడదు. ఇలా జరగకుండా ఉండాలంటే పిహెచ్ బ్యాలెన్స్ సమంగా ఉండే సబ్బుల్ని ఎంచుకోవాలి. ఇందుకోసం చర్మపు పిహెచ్కు దగ్గరగా ఉండే టిఎఫ్ఎమ్ (టోటల్ ఫ్యాటీ మ్యాటర్) ఉన్న సబ్బులు వాడాలి. మార్కెట్లో దొరికే సబ్బుల క్షారత్వాన్ని లిట్మస్ పేపర్ సహాయంతో తెలుసుకోవచ్చు.