బియ్యం పిండి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే బియ్యప్పిండితో ఎన్నో వంటలు వండుకోవచ్చు. ఇది తినే ఆహార పదార్ధంగా మాత్రమే అందరికి తెలుసు కానీ ఈ పిండితో అందాన్ని మరింత రెట్టింపు చేసుకోవచ్చని చాలా మందికి తెలియకపోవచ్చు. సాధారణంగా మెరిసే చర్మానికి చాలా రకాల క్రీములు, లోషన్స్ వాడి ఉంటారు. కానీ, హోంమేడ్ ప్రొడక్ట్స్ ని మాత్రం నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అందులో బియ్యం పిండి కూడా ఒకటి. అవును, బియ్యంపిండి వాడటం వల్ల చర్మానికి ఎన్నో లాభాలు చేకూరతాయి.
బియ్యం పిండి చర్మంపై చాలా ఉన్నతంగా పనిచేస్తుంది. వదులుగా మారిన చర్మాన్ని టైట్ చేయడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది బియ్యం పిండి. మరి దీన్ని ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక బౌల్లో బియ్యం పిండి, అలో వెరా జెల్, తేనె కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. పావు గంట తర్వాత.. శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. నలుపుదనం కూడా తగ్గిపోతుంది. అలాగే ఒక బౌల్ లో బియ్యం పిండి, ఎగ్ వైట్, తేనె కలిపి ముఖానికి పట్టించాలి. ఆరాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఈ ప్యాక్ అన్ని రకాల చర్మ తత్వాలకు సెట్ అవుతుంది. ఈ ప్యాక్ వల్ల ముడతలు, ఫైన్ లైన్స్ తొలగిపోయి చర్మం టైట్ గా ఉంటుంది. అదేవిధంగా, ఒక బౌల్లో బాగా పండిన అరటిపండు గుజ్జుకు బియ్యం పిండి కలుపుకోవాలి. దీనికి ఆముదం కూడా చేర్చాలి. ఈ ప్యాక్ ను కళ్ళ కింద రాసుకుంటే డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి. మరియు ఒక బౌల్ లో బియ్యం పిండి, శనగపిండి, తేనె, పంచదార, కొబ్బరినూనె కలుపుకోవాలి. దీన్ని స్ర్కబ్ లా ఉపయోగిస్తే మృత కణాలు తొలగిపోయి చర్మం మృదువుగా మారుతుంది. బియ్యం పిండి మంచి ఎక్స్ ఫోలియేటర్ గా పనిచేస్తుంది.