మామిడి పండ్లు.. ఈ పేరు వింటేనే నోరూరుతుంది. వేసవి వచ్చిందంటే చాలు.. ఎక్కడ చూసినా మామిడి పండ్లే దర్శనమిస్తుంటాయి. ఇక పండ్లలో రారాజైన మామిడి పండు తినకుండా ఎవరూ ఉండలేరు. వివిధ రుచుల్లో, ఆకారాల్లో, సైజుల్లో, రంగుల్లో లభించే మామిడి పండ్లలో ఎన్నో రకాల ఔషధగుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మామిడి పండ్లలో పొటాషియం, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి. అవి అధిక రక్తపోటు నుంచి రక్షిస్తాయి. మామిడిలో ఉండే విటమిన్ సి, ఫైబర్ శరీరానికి హాని చేసే కొలస్ట్రాల్ని తగ్గిస్తాయి.
ఇక ఆరోగ్యానికే కాదు.. మామిడి పండ్లలో సౌందర్య గుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. మరి స్కిన్ను మెరిపించుకోవడానికి మామిడి పండ్లను ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. అందులో ముందుగా.. మామిడి గుజ్జులో ముల్తానీ మిట్టి మరియు పెరుగు వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.. పావు గంట తర్వాత చల్లటి నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల ముఖంపై ఉన్న మొటిమలు, వాటి వల్ల వచ్చే మచ్చలు తొలిగించి.. కాంతివంతంగా చేస్తుంది. అలాగే మామిడి గుజ్జులో కొద్దిగా తేనె వేసి బాగా మిక్స్ చేయాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.. పావు గంట తర్వాత చల్లటి నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల ముఖంపై ఉన్న మలినాలను తొలగిస్తుంది. ఇక చర్మంపై ముడతలు, నల్ల మచ్చలను తొలగించడానికి మామిడి పండ్లు ఉపయోగపడతాయి. మామిడి పండ్లలోని పొటాషియం చర్మానికి తేమ అందిస్తుంది. సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలను తట్టుకొనే సామర్థ్యాన్ని మామిడి పండ్లు అందిస్తాయి. అందుకే పైన చెప్పిన ఫేస్ మాస్కులతో పాటు రోజుకు ఒక మామిడి పండు కూడా తింటే మంచి ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు.