సౌందర్య పోషణలోనూ, ఆరోగ్య పరిరక్షణలోనూ చందనం ప్రముఖపాత్ర పోషిస్తుంది. చందనాన్ని శరీరానికి రాసుకోవడం వల్ల అనేక రుగ్మతలనుండి మిముక్తి పొందవచ్చు. దీన్ని ఆయుర్వేద ఔషధాల్లో కూడా ప్రత్యేక ద్రవ్యంగా వాడుతుంటారు. జ్వరం తీవ్రంగా ఉన్నపుడు చందనాన్ని అరగదీసి వచ్చిన గంధాన్ని పలుచగా చేసి కొద్దిగా పచ్చక ర్పూరం కలిపి శరీరం మీద ప్రధానంగా నుదుటి మీద పూయాలి. ఇలా చేయడం వల్ల జ్వరం త్వరగా తగ్గుతుంది. కడుపులో మంటగా ఉన్నపుడు చందనం, ఉసిరిపొడి సమానంగా తీసుకుని ఒకచెంచా పొడికికొద్దిగా తేనె కలిపి తింటే కడుపులో మంట తగితుంది. గంధంలో మజ్జిగ లేదా పెరుగు కలిపి చర్మం మీదవచ్చే కురుపులు, గడ్డల మీద రాస్తే త్వరగా మెత్తబడి తగ్గిపోతాయి. చందనం నుండి తైలాన్ని కూడా తీస్తారు. దీన్ని కొబ్బరి నూనెతో కలిపి చాలా కాలం నుండి తగ్గకుండా వేదించే పుళ్ళకి రాయాలి. చందనం కలిపిన పాలు తాగితే వెక్కిళ్ళు తగ్గుతాయి. చందనం, వట్టివేరు, దారు హరిద్రా, చక్కెర, బియ్యం కడిగిన నీళ్ళు కలిపి తింటే రక్తస్రావాన్ని ఆపవచ్చు. మూత్రరోగాలకూ మంచి ఔషధంగా పనిచేస్తుంది. గ్రాము చందనాన్ని ఒక గ్లాసు పాలలో కలిపి దానికి పటిక బెల్లం చేర్చి తాగితే మూత్రంలో మంట తగ్గుతుంది. గనేరియా వంటి వ్యాధులకు కూడా చక్కని ఫలితాన్నిస్తుంది. చందనాన్ని పాలతో కలిపి తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఈ వ్యాధులకు చందన తైలాన్ని కూడా వాడవచ్చు. వ్యాధిని గుర్తించిన వెంటనే 5చుక్కల తైలాన్ని వాము నీటితో కాని అల్లపు రసంతోకాని తాగడం మొదలు పెట్టాలి. తరువాత డోసును పది చుక్కలకు పెంచవచ్చు. కర్పూరం, కుంకుమ పువ్వు కలిపి నుదుటిమీద రాస్తే తలనొప్పి వెంటనే తగ్గుతుంది. దీనిలోని యాంటి సెప్టిక్‌ గుణాలు చర్మవ్యాధులను తగ్గిస్తాయి. చర్మం రంగుని, కాంతిని పెంచుతుంది. నల్లమచ్చలను పోగొడుతుంది. శరీర దుర్వాసననూ దూరం చేస్తుంది. ఒక భాగం చందన తైలం, 2 భాగాలు ఆవనూనె కలిపి రాస్తే మొటిమలు తగ్గుతాయి. గంధపు పొడిని లేదా చందనాన్ని అరగదీసిన గంధాన్ని చెమట పొక్కులపై రాస్తే ఉపశమనం కలుగుతుంది. చందనానికి రోజ్‌వాటర్‌ కలిపి శరీరంలో చెమట ఎక్కువ పట్టే ప్రాంతంలో రాసుకుంటే చెమట తగ్గుతుంది. ఆయుర్వేదంలో ఉపయోగించే చందనాదివటి, చందనాది తైలం,చందనాసవం, అశ్వగంధారిష్టం, శారిబా ద్యాసవం వంటి ఔషధాల్లో కూడా చందనం ఉంటుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: