కరోనా కట్టడికి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. నిబంధనలను మరింత కఠినంగా అమలు చేసే దిశగా కదులుతోంది. రాష్ట్రంలోని మొత్తం 15 జిల్లాలను పూర్తిగా సీల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ రోజు రాత్రి అంటే బుధవారం రాత్రి 12గంటల నుంచి మూసివేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. హోం డెలివరీ, మెడికల్ కిట్స్కు మాత్రమే అనుమతి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. యూపీ నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారుతోంది. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి లాక్డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 14వ తేదీ తర్వాత లాక్డౌన్ కొనసాగించాలా..? వద్దా..? అన్న దానిపై ఈరోజు ప్రధాని నరేంద్రమోడీ అఖిలపక్ష నాయకులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా లాక్డౌన్ కొనసాగించాలని పార్లమెంటరీ పక్ష నేతలు సూచించినట్లు తెలుస్తోంది.
అయితే.. మరోసారి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి తుది నిర్ణయం తీసుకుంటామని ప్రధాని మోడీ చెప్పినట్లు సమాచారం. ఇదే సమయంలో కేంద్రంతో సంబంధం లేకుండా.. యూపీ ప్రభుత్వం నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ ముందడుగు వేయడం గమనార్హం. ఓవైపు లాక్డౌన్ కొనసాగుతుండగానే.. మరోవైపు రాష్ట్రంలోని 15 జిల్లాలను పూర్తిగా సీల్ చేయాలని కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కరోనా వైరస్ బారి నుంచి యూపీని కాపాడాలంటే.. ఇలాంటి నిర్ణయాలు తీసుకోకతప్పడం లేదని ప్రభుత్వం చెబుతోంది. అయితే.. ఈ నిర్ణయాన్ని ఎలా అమలుచేస్తారన్నదే ఇక్కడ పెద్ద సమస్య. ఒకవేళ.. అక్కడ విజయవంతం అయితే మాత్రం.. ఇతర రాష్ట్రాలు కూడా యూపీ బాటలోనే నడిచే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.