తెలంగాణ రాష్ట్రానికి 95శాతం కరోనా వైరస్(కోవిడ్-19) భయం తొలగినట్టేనని మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. బుధవారం సాయంత్రం మంత్రి ఈటల రాజేందర్ విలేకరుల సమావేశంలో పలు కీలక విషయాలను వెల్లడించారు. ఈ ఒక్కరోజే 49 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు అయ్యాయని, దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 453కు చేరిందని ఆయన వెల్లడించారు. తెలంగాణలో కరోనా యాక్టివ్ కేసులు 397 ఉన్నాయని ఆయన తెలిపారు. ఇక ఇప్పటివరకు మొత్తం 11మంది మరణించారని పేర్కొన్నారు. అయితే.. ప్రభుత్వం వద్ద ఇంకా 500కుపైగా మాత్రమే శాంపిల్స్ ఉన్నాయని తెలిపారు. ఢిల్లీ నుంచి వచ్చిన 1100మందికి పరీక్షలు చేశామని ఆయన వెల్లడించారు. వీరితో సంబంధం ఉన్నసుమారు మూడువేల మందికిపైగా ఇప్పటికే క్వారంటైన్ చేశామని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో తెలంగాణకు 95శాతం కరోనా భయం తొలగిందని ఆయన తెలిపారు.
అలాగే.. తెలంగాణలో ఎలాంటి మందుల కొరత లేదని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే.. రెండు మూడు రోజులుగా ఒక్క మరణం కూడా సంభవించలేదు. దీంతో కరోనా కొంతమేరకు అదుపులోనే ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా కరోనాను అరికట్టేందుకు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమాలు చేపడుతున్నారు. ఓ వైపు ప్రజలకు ముందస్తు జాగ్రత్తలు చెబుతూనే మరోవైపు కరోనా బాధితులకు నాణ్యమైన వైద్యసేలు అందిస్తున్నారు. నిజానికి.. చైనాలో కరోనా ప్రతాపం చూపుతున్న సమయంలోనే తెలంగాణలో పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో పారిశుధ్య పననులు చేపట్టారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో కొంతమేరకు కరోనా అదుపులోనే ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే కరోనాను తొందరగా కట్టడి చేయగులుగుతున్నామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.