కరోనా వైరస్ కట్టడికి ఏపీ ప్రభుత్వం శరవేగంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే సొంతంగా టెస్టింగ్ కిట్లు తయారు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న వైసీపీ ప్రభుత్వం తాజాగా.. మరో సాహస నిర్ణయం తీసుకుంది. ఆపద సమయంలో అందరూ కలిసిరావాలని పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 58 ప్రైవేటు దవాఖానలను ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకున్నది. ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకున్న దవాఖానల వివరాలు జిల్లాల వారీగా వెల్లడించింది. విశాఖపట్నం జిల్లాలో 5, ప్రకాశం జిల్లాలో 4, నెల్లూరు జిల్లాలో 5, కర్నూలు జిల్లాలో 6, చిత్తూరు జిల్లాలో 5, కడప జిల్లాలో 3, అనంతపురం జిల్లాలో 4, గుంటూరు జిల్లాలో 4, తూర్పుగోదావరి జిల్లాలో 5, పశ్చిమగోదావరి జిల్లాలో 3, విజయనగరం జిల్లాలో 5, కృష్ణా జిల్లాలో 5, శ్రీకాకుళం జిల్లాలో 4 ప్రైవేటు ఆస్పత్రులు ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చాయి.
ప్రైవేటు దవాఖానల సేవలను ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావడంతో అనేక ప్రయోజనాలు కలుగుతున్నాయి. బాధితులకు మరిన్ని మెరుగైన చికిత్స అందించే అవకాశం ఏర్పడుతోంది. ఈ దవాఖానల్లో మొత్తం 19,114 సాధారణ బెడ్లను, 1,286 ఐసీయూ బెడ్లను సిద్ధం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. వీటితోపాటు 717 ఐసోలేషన్ బెడ్లు కూడా అందుబాటులో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. నిజానికి.. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న దవాఖానల్లో అవసరమైన వైద్య సిబ్బందిని ఏర్పాటు చేసింది. ఒక నిర్మాణాత్మకంగా ముఖ్యమంత్రి జగన్ చర్యలు తీసుకుంటున్నారు. బుధవారం నాడు సొంతంగా టెస్టింగ్ కిట్లనుకూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటిని స్వయంగా ముఖ్యమంత్రి జగన్ పరిశీలించి, ప్రారంభించారు. మరికొద్ది రోజుల్లో మరిన్ని కిట్లను అందుబాటులో తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు.