ఏప్రిల్ 14వ తేదీ తర్వాత కూడా లాక్డౌన్ కొనసాగుతుందన్న సంకేతాలు రావడంతో ఏపీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ సహా తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సులకు అడ్వాన్స్డ్ రిజర్వేషన్ ప్రక్రియను నిలిపివేసింది. కరోనా కట్టడికి లాక్ డౌన్ కొనసాగించడమే ఏకైక మార్గమని తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల చెప్పడంతో ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. లాక్ డౌన్ కొనసాగితే ఇప్పటికే రిజర్వేషన్ చేసుకున్న వారికి పూర్తి సొమ్ము వాపసు ఇస్తామని వారు వెల్లడించారు. నిజానికి.. లాక్డౌన్ తర్వాత రోజు నుంచి వివిధ ప్రాంతాలకు నాన్–ఏసీ బస్సులు నడపాలని ఏపీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. ఈ మేరకు గత నాలుగు రోజులుగా ఆన్లైన్ రిజర్వేషన్ టిక్కెట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచడంతో 15వ తేదీకి టికెట్లు ఫుల్ అయ్యాయి. అయితే.. మొత్తం 200 బస్సులకు రిజర్వేషన్ అవకాశం ఇవ్వగా మొత్తం 7 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి.
దేశవ్యాప్తంగా రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో లాక్డౌన్ ఎత్తేసే అవకాశాలు కనిపించడం లేదు. ఇదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తోపాటు మరికొందరు ముఖ్యమంత్రులు లాక్డౌన్ ఉండాలని సూచించారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇప్పట్లో లాక్డౌన్ ఎత్తేసే అవకాశాలు లేవన్న సంకేతాలు ఇచ్చారు. దీంతో అప్రమత్తమైన ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు బుధవారం నుంచి ఏపీలోని అన్ని ప్రాంతాలకు రెండు వైపులా బుకింగ్ను ఆపేశారు. లాక్ డౌన్ కొనసాగితే బుకింగ్ చేసుకున్న టిక్కెట్లకు సంబంధించి పూర్తి సొమ్మును వాపసు చేస్తామని అధికారులు చెబుతున్నారు. ముందుగా ప్రకటించిన ప్రకారం ఈనెల 14వ తేదీతో లాక్డౌన్ ముగుస్తుంది. దీంతో 15 నుంచి 20వ తేదీ వరకు ఆర్టీసీ టిక్కెట్ల రిజర్వేషన్ను అధికారులు నాలుగు రోజుల క్రితం అందుబాటులోకి తెచ్చారు. ఆరు రోజులకు వివిధ ప్రాంతాలకు కలిపి 42,377 టిక్కెట్లు ఇప్పటికే బుక్ అయ్యాయి.