కరోనా వైరస్ కారణంగా వైద్యలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ వైపు కరోనా బాధితులకు సేవలు అందిస్తున్న క్రమంలో ఇప్పటికే పలువురు డాక్టర్లు కరోనా బారినపడ్డారు. మరికొందరు నర్సులు కూడా కరోనాతో బాధపడుతున్నారు. ఇదిలా ఉండగా.. వైద్యులు బయటకు వచ్చినప్పుడు కూడా స్థానిక ప్రజలు వారిని చూసి తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కరోనా పెషెంట్లకు చికిత్స చేస్తున్న డాక్టర్లకు ఇళ్లను కిరాయికి ఇవ్వొద్దని, వారిని దగ్గరకు రానివ్వొద్దంటూ ఇప్పటికే పలుచోట్ల ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అయితే.. ఢిల్లీలో మరో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. సఫ్దార్జంగ్ దవాఖానకు చెందిన ఇద్దరు మహిళా డాక్టర్లపై స్థానికులు దాడికి పాల్పడ్డారు. వారిని తీవ్రంగా గాయపర్చడంతో దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.
బుధవారం రాత్రి 9గంటల ప్రాంతంలో ఇద్దరు మహిళా డాక్టర్లు పండ్లు కొనేందుకు బయటకు వచ్చారు. ఈ క్రమంలో పలువురు స్థానికులు వారిని చూసి ఒక్కసారిగా అరవడం మొదలుపెట్టారు. కరోనా వైరస్ను వ్యాప్తి చేయడానికి వస్తున్నారంటూ వారినిచుట్టుముట్టారు. మహిళా డాక్టర్లు ఎంత చెబుతున్నా వినకుండా స్థానికులు వారిపై దాడి చేసి గాయపర్చారు. గాయపడిన మహిళా డాక్టర్లను మరికొందరు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో వైద్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తాము అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు ప్రాణాలకు తెగించి, వైద్యసేవలు అందిస్తున్న తమపై ఇలా దాడులు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా.. మహిళా డాక్టర్లై దాడిని అన్నివర్గాల ప్రజలు ఖండిస్తున్నారు.