కరోనా వైరస్ మానవాళి మనుగడుకు అత్యంత ప్రమాదకారిగా మారుతోంది. రోజురోజుకూ వైరస్ ప్రభావం తీవ్రమవుతోంది. దాని పేరు వింటేనే జనం భయంతో వణికిపోతున్నారు. దగ్గినా.. తుమ్మినా.. అమ్మ బాబోయ్.. ఇవి కరోనా లక్షణాలే అంటూ బెంబేలెత్తిపోతున్నారు. ఇక అనుమానిత లక్షణాలు ఉన్న వారిని ఆమడదూరంలో ఉంచుతున్నారు. నిజానికి.. తీవ్ర వివక్ష చూపుతున్నారు జనం.. ఇదే సమయంలో తమకు ఎక్కడ కరోనా సోకుతుందోనని తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారు. ఒకవేళ తనకు కరోనా సోకితే.. సమాజంలో తలెత్తుకోకుండా ఉండాల్సి వస్తుందని, ఇలాంటి సమయంలో బతకడం కన్నా.. చావడమే మేలని పలువురు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఈ క్రమంలో నిండుప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. తాజాగా.. ఢిల్లీలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఈ ఘటన వైద్యులను, స్థానికులను తీవ్రంగా కలిచివేసింది.
ఇటీవల అస్ట్రేలియాలోని సిడ్నీ నుంచి 35ఏళ్ల వ్యక్తి ఇండియాకు వచ్చాడు. అయితే.. అతన్ని ఎయిర్పోర్టులోనే అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడిలో అనుమానిత కరోనా లక్షణాలు కనిపించడంతో వెంటనే ఢిల్లీలోని సఫ్దార్జంగ్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతనికి పరీక్షలు నిర్వహించేందుకు శాంపిల్స్ సేకరించారు వైద్యులు. ఇంకా ఎలాంటి రిపోర్టు కూడా రాలేదు. ఈ క్రమంలో తీవ్ర మానసిక ఒత్తడికి గురైన ఆ వ్యక్తి ఆస్పత్రి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వైద్యులను తీవ్రంగా కలిచివేసింది. తనకు ఎక్కడ కరోనా పాజిటివ్ అని వస్తుందోనని తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన అతడు చివరికి ఇలా ప్రాణాలు తీసుకోవడంతో అందరూ కన్నీటిపర్యంతమయ్యారు. నిజానికి.. ఇలాంటి ఘటనలు తరచూ ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు, అధికారలు ప్రజల్లో మానసిక స్థైర్యం నింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నా..ఇలాంటి ఘటనలు మాత్రం ఆగడం లేదు.