మానవాళి కంటికి కునుకులేకుండా చేస్తున్న కరోనా వైరస్కు ఇప్పటికీ ఎలాంటి మందులేదు.. వ్యాక్సిన్ లేదు.. అగ్రరాజ్యాలు కూడా కరోనా ప్రతానికి విలవిలాడుతున్నాయి. దీనిని ఎలా ఎదుర్కోవాలో తెలియక ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. అయితే.. కరోనాకు విరుగుడు కనిపెట్టేందుకు అన్నిదేశాల్లోనూ శాస్త్రవేత్తలు అనేక ప్రయత్నాలు చేస్తున్నారుగానీ.. క్లారిటీ మాత్రం రావడం లేదు. అయితే.. తాజాగా ప్రపంచ ఆరోగ్యం సంస్థ కీలక ప్రకటన చేసింది. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రస్తుతం మన చేతిలో ఉన్న ఏకైక ఆయుధం ఐక్యతను చాటడమేనని చెబుతోంది. మానవాళి ఐక్యతే కరోనా మహమ్మారిని తరిమికొడుతోందని అంటోంది. ఆత్మస్థైర్యం కోల్పోకుండా ముందడుగు వేసినప్పుడు కరోనా తోకముడుస్తుందని చెబుతోంది. చైనాలోని వుహాన్ నగరం కేంద్రంగా పుట్టిన కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ నిరంతరం అప్రమత్తం చేస్తూనే ఉంది.
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రపంచ ఆరోగ్యం సంస్థ సూచిస్తూనే ఉంది. ఇందులో ప్రధానంగా.. సామాజిక దూరం పాటించాలని, ఎప్పటికప్పుడు చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలని చెబుతోంది. ఇలా నిరంతరం మానవాళిలో ఆత్మస్థైర్యం నింపేందుకు ప్రయత్నం చేస్తోంది. మాస్క్లు ధరించడం ఒక్కటే సరిపోదని.. ఇవన్నీ పాటించాలని సూచిస్తోంది. ఇదిలా ఉండగా.. ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థపై మొదటి నుంచీ కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చైనాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ వత్తాసు పలుకుతోందని ఆరోపిస్తున్నారు. చైనాలో పుట్టిన వైరస్ గురించి ముందస్తుగా చెప్పకుండా చైనా దాచినా కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ పెద్దగా పట్టించుకోలేదని మండిపడ్డారు. ఈ సమయంలోనై కరోనాను చైనీస్ వైరస్ అంటూ ట్రంప్ వ్యాఖ్యానించగా డబ్ల్యూహెచ్వో తీవ్రంగా పరిగణించిన విషయం తెలిసిందే.