భారత్లో కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తోంది. ఏప్రిల్ 9వ తేదీ ఉదయం నాటికే భారత్లో సుమారు ఆరువేల పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. సుమారు 180మంది మరణించారు. ఇక కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే. భారత్ పక్కనే ఉన్న నేపాల్, భూటాన్ దేశాల్లో కరోనా వైరస్ ప్రభావం ఎలా ఉంది.. అసలు అక్కడ ఎన్ని పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.. ఎంత మంది చనిపోయారు...? ఇలాంటి ప్రశ్నలు రావడం సహజమే. నేపాల్, భూటాన్లో కూడా కరోనా బీభత్సం సృష్టిస్తుందని అనుకుంటే మాత్రం పొరపాటుపడినట్టే. ఈ రెండు దేశాల్లో కరోనా వైరస్ ప్రభావం పెద్దగా లేనే లేదు. భూటాన్లో ఇప్పటివరకు అంటే.. ఏప్రిల్ 9వ తేదీ ఉదయం 11గంటల వరకు ఐదు పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. నెపాల్లో తొమ్మిది పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
ఆశ్చర్యంగా ఉంది కదూ.. నిజంగా ఈ రెండు దేశాల్లో ఇంత తక్కువగా కరోనా ప్రభావం సంతోషపడాల్సిన విషయమే. ఒకవేళ యూరప్ దేశాలు, అమెరికాలోలాగా కరోనా బీభత్సం సృష్టించి ఉంటే మాత్రం ఈ రెండు దేశాలు ఉనికే లేకుండా పోయేవని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. వైశాల్యంలోనూ, జనాభాలోనూ చిన్నదేశాలే అయినప్పటికీ కరోనా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాయని చెబుతున్నాయి. అంతర్జాతీయంగా ప్రయాణాలు తక్కువగా ఉండడం, అక్కడి ప్రజలు జీవన విధానం కూడా కరోనా కట్టడికి దోహదపడి ఉంటాయని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే ఇక్కడ మరొక విషయం ఏమిటంటే.. సార్క్ దేశాల్లో ఈ రెండు దేశాల్లోనే అతితక్కువ కేసులు నమోదు కావడం.