రాష్ట్రంలో లాక్డౌన్ వల్ల రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. అత్యవసరం అయితే మినహా ఏ ఒక్కరూ కూడా ఇల్లు దాటి కాలు బయట పెట్టడంలేదు.
అయితే బోధన్కు చెందిన రజియాబేగం తన కుమారుడి కోసం 1400 కిలోమీటర్లు ప్రయాణించింది.
స్థానిక ప్రభుత్వ పాఠశాలలో టీచర్గా విధులు నిర్వర్తిస్తున్న రజియాబేగంకు ఇద్దరు కుమారులు. చిన్నవాడైన మహ్మద్ నిజాముద్దీన్ స్నేహితుడి తండ్రి ఆరోగ్యం బాగా లేదని తెలియడంతో అతడికి తోడుగా మార్చి 12 న నెల్లూరుకు వెళ్లాడు. ఇదే సమయంలో కరోనా కారణంగా ప్రభుత్వం లాక్డౌన్ విధిం చడంతో అక్కడే∙చిక్కుకుపోయాడు.
ఇది తెలిసి తల్లి రజియాబేగం ఆందోళనకు గురయ్యారు. బోధన్ ఏసీపీ జైపాల్రెడ్డిని కలిసి పరిస్థితిని వివరించారు. ఆయన ఇచ్చిన లెటర్ తీసుకుని, 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న నెల్లూరుకు సోమవారం ఉదయం స్కూటీపై బయల్దేరి, మంగళవారం మధ్యాహ్నం చేరుకున్నారు. కుమారుడితో కలిసి అదే స్కూటీపై సాయంత్రం తిరుగు ప్రయాణమయ్యారు. బుధవారం మధ్యాహ్నం వారు కామారెడ్డికి చేరుకున్నారు. కొడుకును చూడాలనే తపన తనను అంతదూరం వెళ్లేలా చేసిందని ఆమె తెలిపారు. చాలా చోట్ల పోలీసులు ఆపారని, బోధన్ ఏసీపీ ఇచ్చిన లెటర్ను చూపించడంతో అనుమతించారని వివరించారు. ఈసందర్భంగా ఆమె పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.