కరోనా వైరస్ ప్రపంచాన్ని కబళిస్తోంది. మానవాళికి పెనుముప్పుగా మారిన కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు ప్రస్తుతానికి ఎలాంటి చికిత్సగానీ, వ్యాక్సిన్గానీ అందుబాటులో లేదు. అయితే కోవిడ్-19 నివారణకు టీకాలను రూపొందించే పనిలో ప్రపంచవ్యాప్తంగా పలువురు నిపుణులు, శాస్త్రవేత్తలు తలమునకలైవున్నారు. ప్రధానంగా వ్యాక్సిన్ రూపకల్పనపై ప్రత్యేక దృష్టిపెట్టిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కీలకమైన అంశాన్ని వెల్లడించింది. రాబోయే ఆరు నెలల్లో నయం చేయలేని వ్యాధికి వ్యాక్సిన్ తయారు చేయగలమంటూ పేర్కొంటుంది.
మూడవ దశ ట్రయల్ అనంతరం కరోనా వైరస్కు వ్యాక్సిన్ సిద్ధమవుతుందని ఆక్సఫర్డ్ యూనివర్శిటీ పరిశోధకులు వెల్లడించారు. 2020 సెప్టెంబరు, డిసెంబరు మధ్య కాలం నాటికి తొలి వ్యాక్సిన్ అందుబాటులో ఉంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని బ్రిటన్ చీఫ్ సైంటిఫిక్ సలహాదారు సర్ పాట్రిక్ వాలెన్స్ వివరించారు. ఈ నెలాఖరు నుంచి సెప్టెంబర్ వరకు 500 మంది వాలంటీర్లపై పరిశోధనలు నిర్వహించిన అనంతరం కచ్చితమైన డోస్తో వ్యాక్సిన్ను విడుదల చేస్తామని చెప్పారు. కనీసం 2021 ప్రారంభంనాటికి వ్యాక్సిన్ సిద్ధమవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.