కరోనా దెబ్బకు ఇప్పటికే అన్ని వ్యవస్థలు కుప్పకూలాయి. ముఖ్యంగా భారత్లో లాక్డౌన్ ఎఫెక్ట్ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కోవిడ్-19 భవిష్యత్లో కూడా ఆర్థిక వ్యవస్థను వెంటాడే ముప్పు ఉందని ఆర్బీఐ పేర్కొంది. దేశ ఆర్థిక వ్యవస్థపై లాక్డౌన్ ప్రభావం నేరుగా ఉంటుందని స్పష్టం చేసింది. అంతర్జాతీయ స్ధూల ఆర్థిక పరిస్థితులను కరోనా మహమ్మారి తారుమారు చేసిందని పేర్కొంది. అంతర్జాతీయ ఉత్పాదకత, సరఫరా వ్యవస్థలు, వర్తకం, పర్యాటక రంగానికి తీవ్ర ఆటంకాలు ఎదురవుతాయని కేంద్ర బ్యాంక్ వెల్లడించిన ద్రవ్య విధాన నివేదికలో పేర్కొంది.
కరోనా కట్టడికి విధించిన మూడు వారాల లాక్డౌన్ 16వ రోజుకు చేరిన సందర్భంగా ఆర్బీఐ నివేదికను విడుదల చేసింది. కోవిడ్-19 వ్యాప్తికి ముందు 2020-21లో వృద్ధిరేటు రికవరీ ఆశాజనకంగా ఉండగా మహమ్మారి ప్రభావంతో ఇది తారుమారైందని ఆర్బీఐ పేర్కొంది. కరోనా మహమ్మారి వ్యాప్తి, దాని తీవ్రతను అంచనా వేస్తున్నామని.. లాక్డౌన్ల కారణంగా 2020లో ప్రపంచ ఉత్పాదకత పడిపోవడం వృద్ధి అంచనాలపై పెనుప్రభావం చూపుతుందని ఆర్బీఐ తెలిపింది. అంతేగాక కోవిడ్-19 ప్రభావంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి ప్రవేశిస్తుందని ఆర్బీఐ హెచ్చరించింది.