దేశంలో కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్డౌన్ ఈనెల 14తో ముగియనుంది. అన్ని రాష్ట్రాల్లో 21 రోజులపాటు లాక్డౌన్ కట్టుదిట్టంగా అమలవుతోంది. కేసులు అధికంగా ఉన్న ప్రాంతాలను హాట్స్పాట్ గా ప్రకటించి, దిగ్బంధనం చేశారు. అయా ప్రాంతాల్లోని ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రాాకుండా ఆంక్షలు విధించారు. కాగా లాక్ డౌన్ గడువు తేదీ ముగియనుండటంతో దీనిపై ప్రధాని మోడీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారోనని దేశ ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
మరోపక్క కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలు, ఉమ్మడి పోరాటం గురించి నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం చర్చించారు. స్వయంగా ఈ విషయాన్ని మోడీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. క్లిష్టమైన సవాల్తో పోరాడుతున్న నేపాల్ ప్రజల కు అభినందనలు తెలిపిన మోడీ.. ఈ విషయంలో వారికి బాసటగా నిలుస్తామని భరోసా కల్పించారు.