భారత్లో రోజురోజుకూ కరోనా వైరస్ ప్రభావం పెరుగుతోంది. ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య సుమారు ఏడువేలకు చేరువలోఉంది. ఇక మరణాల సంఖ్య 206కు చేరుకుంది. అయితే.. దేశంలో మొత్తం 720 జిల్లాలు ఉన్నా.. దాదాపుగా 400 జిల్లాలో కరోనా వైరస్ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. ఇందులో కూడా చాలా జిల్లాల్లో పాజిటివ్ కేసులు నమోదు కాకపోవడం గమనార్హం. ఇదే సమయంలో దేశంలోని 133 జిల్లాల్లో కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. దేశ వ్యాప్తంగా నమోదు అవుతున్న కరోనా పాజిటివ్ సంఖ్య ఎక్కువగా ఈ జిల్లాల్లోనే ఉంది. ఈ నేపథ్యంలో ఈ జిల్లాల్లో ప్రత్యేక కార్యాచరణతో ప్రభుత్వం ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 196 రెడ్జోన్ జిల్లాలనుకూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సంఖ్య ముందుముందు పెరిగే అవకాశాలు ఉన్నాయి.
అయితే.. ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 14 తర్వాత దేశంలో లాక్డౌన్ కొనసాగించాలా..? వద్దా..? అనే అంశంపై చర్చించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రుల అభిప్రాయాల మేరకు ప్రధాని మోడీ లాక్డౌన్పై నిర్ణయం తీసుకుంటారని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు దేశంలో కరోనా ప్రభావం లేని సుమారు 400 జిల్లాల్లో పాక్షికంగా లాక్డౌన్ ఎత్తేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే ఈ మేరకు ప్రణాళిక కూడా రూపొందించినట్లు తెలుస్తోంది. సామాజిక దూరం, స్వీయనియంత్రణ పాటించడం వల్లే కరోనా మహమ్మారిని తరిమికొట్టవచ్చుననే విషయాన్ని ఇప్పటికే ప్రజల్లోకి ప్రభుత్వాలు బలంగా తీసుకెళ్లాయి. మరోవైపు కేంద్రం నిర్ణయంతో సంబంధం లేకుండా.. ఒడిశా, పంజాబ్ తదితర రాష్ట్రాలు ఇప్పటికే లాక్డౌన్ను ఈ నెలాఖరు వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి.