కరోనాతో ఏర్పడిన విపత్కర పరిస్థితుల్లో అనేక దేశాలు భారత్ సాయం కోసం ఎదురుచూస్తున్నాయి. భారత్లో కరోనా వ్యాప్తి నిరోధానికి కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూనే.. ఇతర దేశాలకు తనవంతు సాయం అందించే దిశగా కదులుతోంది. ఇందులో ప్రధానంగా ప్రస్తుతం కరోనా వైరస్కు విరుగుడుగా ఎక్కువగా హైడ్రాక్సీక్లోరోక్విన్ మందును వినియోగిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ మందుల తయారీ ఎక్కువగా భారత్లోనే ఎక్కువగా ఉండడంతో మిగతా దేశాలన్నీ కూడా భారత్పైనే ఆధారపడుతున్నాయి. నిజానికి.. చాలా సంక్లిష్ట పరిస్థితుల్లోకూడా ఇతర దేశాల బాగోగులను భారత్ చూస్తుండడంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇప్పటికే మొదటి జాబితా ప్రకారం అమెరికాతోపాటు మరో 12 దేశాలకు హైడ్రాక్సీక్లోరోక్విన్ మందును భారత్ పంపింది.
తాజాగా.. ఇతర దేశాల్లో ఏర్పడుతున్న ఆహార సంక్షోభాన్ని నివారించేందుకు భారత్కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఆఫ్ఘనిస్తాన్తోపాటు లెబనాన్కు గోధుమలను పంపించేందుకు నిర్ణయం తీసుకుంది. జీటుజీ విధానంలో 90వేల టన్నుల గోధుమలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 50,000 టన్నుల గోధుమలను ఆఫ్ఘనిస్తాన్కు, 40,000 టన్నులను లెబనాన్కు ఎగుమతి చేయనున్నట్లు భారత్ శుక్రవారం తెలిపింది. ఆయా దేశాల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇంతటి కష్టకాలంలో ఇతర దేశాల ఆకలిని తీర్చేందుకు భారత్ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రపంచ వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. కాగా, ఈ సారి భారత్లో గోధుమ పంట ఉత్పత్తి కూడా అత్యధికంగా ఉంటుందని కేంద్ర వ్యవసాయ శాఖ తెలిపింది. ఈ మేరకు మిగులు గోధుమలను ఇతర దేశాలకు తరలిస్తున్నట్లు పేర్కొంది.