దేశ వ్యాప్తంగా క‌రోనా క‌ట్ట‌డికి వచ్చే మూడు నాలుగు వారాలు అత్యంత కీల‌క‌మ‌ని, దేశ ప్ర‌జ‌ల ప్రాణాల‌తోపాటు ఆర్థిక వ్య‌వ‌స్థ‌నూ కాపాడుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. కోవిడ్ -19 ప్రభావం, పరిణమాలపై 13 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో శనివారం ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. ఈ సందర్భంగా ఆయ‌న ముఖ్య‌మంత్రుల‌తో ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. ప్రజల జీవితంతో పాటు దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ ముఖ్యమేనని ప్ర‌ధాని అన్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ఇప్పటి వరకు తీసుకున్న చర్యల ప్రభావాన్ని నిర్ణయించడానికి వ‌చ్చే మూడు నాలుగు నెల‌లు అత్యంత కీల‌క‌మ‌ని ఆయ‌న చెప్పారు. అయితే.. ప్రధాని మోడీ మాత్రం లాక్‌డౌన్ పొడిగించే అవ‌కాశాలే ఎక్కువ‌గా ఉన్నాయ‌ని ప‌లువురు విశ్లేష‌కులు అంటున్నారు. ప్ర‌జ‌లు త‌ప్ప‌కుండా సామాజిక దూరం పాటించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న సూచించారు. ఇదే స‌మ‌యంలో రెడ్‌జోన్ల‌లో మ‌రింత క‌ఠినంగా నియ‌మాల‌ను అమ‌లు చేయాల‌ని ఆయ‌న సూచించారు.

 

సామాజిక దూరం పాటించ‌డం వ‌ల్లే క‌రోనాను అరిక‌ట్ట‌వ‌చ్చున‌ని ప్ర‌ధాని మోడీ అన్నారు. ప్ర‌జ‌ల ప్రాణాల‌తోపాటు ఆర్థిక వ్యవస్థ వైపు చూడాలని అని మోదీ చెప్పారు. ఇంత‌టి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో అంద‌రం క‌లిసిక‌ట్టుగా ఉండాల‌ని, అప్పుడే క‌రోనాను ఎదుర్కొనే శ‌క్తి వ‌స్తుంద‌ని ఆయ‌న అన్నారు. *మనం ఉంటేనే ప్రపంచం... అన్నది నిన్నటి మంత్రం.  మనం ఉండాలి, ప్రపంచమూ ఉండాలి... అనేది నేటి మంత్రం* అని మోడీ అన్నారు.  వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా వినియోగదారుడికి అందేలా మార్కెటింగ్ చట్టాల్లో మార్పులు తీసుకురావాల‌ని సూచించారు. అలాగే.. ఆరోగ్య సేతు యాప్ ఇకనుంచి ట్రావెల్ ఈ పాస్ లాగా ఉపయోగపడుతుంద‌ని అన్నారు. డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది  పైన దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల‌న్నారు. దేశంలో అవ‌స‌ర‌మైన మందులు అందుబాటులో ఉన్నాయ‌ని, ఎవ‌రైనా బ్లాక్ మార్కెటింగ్ చేస్తే క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌న్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: